Kakinada Janasena MP Candidate : పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటా.. కాకినాడ ఎంపీ అభ్యర్థిని స్వయంగా ప్రకటించిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నాయకులతో సమావేశం అయ్యారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్ కి పిఠాపురం నుంచి అన్ని సామాజిక వర్గాల నాయకులు హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్ పక్కన పిఠాపురం ఇంచార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో తంగెళ్ల ఉదయ్ మెజారిటీ లక్ష అనే నినాదం ఇచ్చారు. ఇక పవన్ ప్రసంగిస్తూ.. అక్కడికి వచ్చిన నాయకులని పేరు పేరునా పలకరించారు.
పవన్ మాట్లాడుతూ పిఠాపురం నుంచే రాష్ట్ర దశ దిశా మారుతుంది అని అన్నారు. పిఠాపురంని తన స్వస్థలంగా మార్చుకుంటానని జనసేనాని అన్నారు. తాను అసాధ్యం అనుకున్న ఎన్డీయే కూటమిని కలిపి చూపించానని అన్నారు. అదే విధంగా దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని అన్నారు. రైతులు కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
భూగోళం బద్దలైనా నిధులు తీసుకువచ్చి పిఠాపురంని అభివృద్ధి చేస్తానని జనసేనాని అన్నారు. తాను రాష్ట్రము మొత్తం పర్యటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ పిఠాపురం ప్రజలు తనని గెలిపించుకుంటారనే నమ్మకం ఇచ్చినట్లు పవన్ అన్నారు. గత ఎన్నికల్లో నేను సరిగ్గా ఓటు వేయమని అడగలేదు. ఈసారి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా.. నన్ను అసెంబ్లీకి పంపండి అని పవన్ కోరారు.
ఈ మీటింగ్ లో పవన్ కీలక ప్రకటన చేశారు. కాకినాడ జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. ఉదయ్ తన తమ్ముడు లాంటి వాడు అని పవన్ అన్నారు. జనసేన పార్టీ పిఠాపురం, కాకినాడలో అఖండ మెజారిటీతో గెలవాలని పవన్ కోరారు. అదే విధంగా పోటీ చేస్తున్న 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని కోరారు. పవన్.. ఉదయ్ ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగానే మీటింగ్ లో హర్షద్వానాలతో మారుమోగింది.