Kinjarapu Acham Naidu Comments on YCP : టిడిపి జనసేన పార్టీలు కలిసాయని.. ఇక వైసీపీకి దబిడి దిబిడే అన్నారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చం నాయుడు. ఈరోజు విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటుచేసిన “యువ గళం నవ శకం” సభలో ఆయన ప్రసంగించారు. టిడిపి, జనసేనలలో బలహీన వర్గాల వారి నాయకులుగా పనిచేస్తున్నారు. వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారు అని ఆయన వైసీపీని దుయ్యబడ్డారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని సైకో జగన్ ని ఆంధ్ర ప్రజలు తరిమికొడతారని ఆయన తెలిపారు. ఏపీకి పట్టిన దరిద్రాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలని ప్రజల్ని కోరారు. లోకేష్ గురించి అచ్చం నాయుడు మాట్లాడుతూ.. లోకేష్ చంద్రబాబు వారసుడు మాత్రమే కాదు.. రాజకీయ పరిణితి కలిగిన నాయకుడని తాను ఎప్పుడో చెప్పానని గుర్తు చేశారు.
ఇక ఈ పాదయాత్రతో యుద్ధం చేసే యోధుడని రుజువైందంటూ కొనియాడారు. యువగళంపై సైకో జగన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసింది. లోకేష్ వాటిని అధిగమించి పాదయాత్ర ద్వారా బాధితులను ఓదార్చి ప్రజల్లో చైతన్య నింపారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేనలకు 160 సీట్లు వస్తాయని.. ప్రజలంతా ఏకమై టిడిపి, జనసేన నాయకత్వాన్ని ఆదరించి ఆశీర్వదించాలి అని ఆయన కోరారు..