Lokesh Kanagaraj: అమీర్ ఖాన్తో యాక్షన్ మూవీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్
Lokesh Kanagaraj: ‘విక్రమ్’, ‘లియో’ వంటి చిత్రాలతో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టికర్తగా అభిమానుల మనసు దోచుకున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సంచలన ప్రకటన చేశారు. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్తో తదుపరి సినిమా ఉండబోతుందని ధృవీకరించారు. ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘కూలీ’ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న లోకేశ్, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
లోకేశ్ తన కలల ప్రాజెక్ట్ ‘ఇరుంబు కై మాయావి’ని ఆమీర్ ఖాన్తో తెరకెక్కిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, “పదేళ్ల క్రితమే నేను ఆ కథ రాశాను. కానీ, ఇటీవల వచ్చిన ఒక పౌరాణిక చిత్రంలోని కొన్ని సన్నివేశాలు నా కథలో ఉన్న సన్నివేశాలకు చాలా దగ్గరగా ఉండటంతో స్క్రిప్ట్ను పూర్తిగా మార్చేశాను. ఆమీర్ సర్తో ఒక యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాం. అయితే అది సూపర్హీరో కథనా లేక ఫాంటసీ కథనా అనేది ఇంకా ఖరారు కాలేదు” అని వివరించారు. గతంలో ‘ఇరుంబు కై మాయావి’ కథను సూర్యతో తీస్తారని వార్తలు వచ్చాయి.
‘కూలీ’ సినిమా విశేషాలు..
రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా గురించి మాట్లాడుతూ లోకేశ్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “ఈ కథను మొదట దర్శకుడు నెల్సన్కు చెప్పాను. అదే సమయంలో అతను నాకు ‘జైలర్ 2’ కథ వినిపించాడు. స్నేహితులమైన మేము ఇద్దరం రజనీకాంత్ సర్తో సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘కూలీ’ ప్రచార చిత్రాల్లో వాచ్ను హైలైట్ చేయడంతో చాలా మంది ఇది టైమ్ ట్రావెల్ మూవీ అనుకుంటున్నారు. కానీ, సినిమాలో వాచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు చాలా కీలకం” అని తెలిపారు. ఈ సినిమా LCUలో భాగం కాదని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కూలీ’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకేశ్ త్వరలో నటుడిగా కూడా ప్రేక్షకులను పలకరించనున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాలో నటించనున్నారు. ఇందుకోసం మూడు నెలల పాటు గడ్డం, జుట్టు పెంచమని దర్శకుడు సూచించారని, ‘కూలీ’ ప్రమోషన్స్ కోసం కొద్దిగా కటింగ్ చేయించుకోవాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు.
