Drishyam 3: సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్కు గుడ్న్యూస్.. ‘దృశ్యం 3’ షూటింగ్ షురూ..
Drishyam 3: మలయాళ చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ అంటే కేవలం ఒక సినిమా కాదు, ఒక సంచలనం. కుటుంబ కథాంశాన్ని ఉత్కంఠభరితమైన క్రైం థ్రిల్లర్గా మలిచి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. దర్శకుడు జీతూ జోసెఫ్, స్టార్ హీరో మోహన్లాల్ కాంబినేషన్లో బ్లాక్బస్టర్గా నిలిచిన ‘దృశ్యం’ సిరీస్లో మూడో భాగం సోమవారం అధికారికంగా మొదలైంది.
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కేరళలోని పూతొట్ట లా కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోహన్లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్తో పాటు చిత్ర బృందం హాజరైంది. పూజతో రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ సినిమాలో కూడా మీనా మరోసారి మోహన్లాల్ భార్య రాణి పాత్రలో నటించనుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
‘దృశ్యం’ మొదటి భాగం థియేటర్లలో విడుదలై రికార్డులు సృష్టించగా, రెండో భాగం ఓటీటీలో విడుదలై గ్లోబల్ హిట్గా నిలిచింది. ఈ రెండు చిత్రాలు తెలుగుతో సహా అనేక భాషల్లో రీమేక్ అయి విజయం సాధించాయి. ‘దృశ్యం 3’ కూడా అదే స్థాయిలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించడం ఖాయమని మూవీ లవర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కూడా ఆశీర్వాద్ సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ‘జార్జ్కుట్టి ప్రపంచంలోకి మరోసారి వస్తున్నాం’ అని మోహన్లాల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
https://x.com/Mohanlal/status/1970006377516110072
కొన్ని రోజుల క్రితం దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం 3 ఎలా ఉండనుందో చెప్పుకొచ్చారు. ‘‘దృశ్యం 3 ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. గతంలో వచ్చిన రెండు భాగాల విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. బాక్సాఫీసు విషయాన్ని పక్కనపెడితే ప్రేక్షకుల ఆదరణ నాకెంతో సంతోషాన్నిచ్చింది. మోహన్లాల్ (Mohanlal) పాత్ర అందరికీ నచ్చింది. ఆయన నాకు ఎప్పుడూ జార్జ్ కుట్టీనే. ఈ నాలుగేళ్లలో ఆయన పాత్రలో ఎన్నో మార్పులు చేశాను. గతంలో వచ్చిన రెండు భాగాల కంటే మూడో పార్ట్ పూర్తి భిన్నంగా ఉంటుందని నేను (Jeethu Joseph) హామీ ఇవ్వగలను. కానీ, రెండో భాగంలో ఉన్నట్లు హై- ఇంటెలిజెన్స్ సన్నివేశాలు ఉంటాయని అంచనాలు పెట్టుకుంటే మాత్రం వారికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఇది పూర్తి భిన్నంగా రానుంది’’ అని అన్నారు.
