Nadendla Manohar : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజలకు మరింత చేరువ కావడానికి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను తలపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ.. ప్రజలతో మమేకం కావడానికి పవన్ కళ్యాణ్ యాత్ర సంకల్పాన్ని తలపెట్టారు.
ఈ వారాహి యాత్రను పార్టీ శ్రేణులంతా కలసి విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకుంటారని ఆయన తెలిపారు. కొల్లూరు మండల జనసేన శ్రేణులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు.
వారాహియాత్ర ప్రణాళిక గురించి ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండల నాయకులతో కాసేపు ఆయన ముచ్చటించారు. స్థానిక సమస్యలపై చర్చించారు. మండల పరిధిలో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రహదారుల దుస్థితి, జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల లేమి, లబ్దిదారులు పడుతున్న ఇక్కట్లు, గిట్టుబాటు ధర లేక రైతులు పడుతున్న
అవస్థలను, కొల్లూరు మండల జనసేన నాయకులు నాదెండ్ల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ కమిటీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కొల్లూరు మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య, పార్టీ నాయకులు ఈమని మణికంఠ, పవన్ కుమార్, కోలా కుమార్ నాథ్, ఉప్పు శ్రీను, బావిరెడ్డి ప్రశాంత్, గుంటూరు వంశీ, జన సైనికులు పాల్గొన్నారు.