Nagababu Comments on YCP Ministers : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు వైసీపి ప్రభుత్వ పాలనను ఎండగట్టారు. ముఖ్యంగా వైసిపి లోని మంత్రులు మాట్లాడిన మాటలను ఆయన ఎద్దేవా చేశారు. ఒక మంత్రేమో పథకాలు ముఖ్యమా? రోడ్లు ముఖ్యమా? అని మాట్లాడతాడు… ఇంకో మంత్రి ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగింది అంటాడు. మరో మంత్రి ఏకంగా కోర్టులోనే దొంగతనాలు చేయిస్తాడు.. ఇలాంటి వారంతా మంత్రులుగా పాలన వెలగబెడితే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని నాగబాబు ప్రశ్నించారు.
దేవాలయం లాంటి శాసనసభలో బూతులు మాట్లాడటం, స్టేజ్ లు మీద డ్యాన్సులు కట్టడం తప్ప వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవని అన్నారు. భారతదేశానికి స్వాతంత్యం వచ్చాక ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు చూడలేదన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఎలా తిట్టాలో సకల శాఖ మంత్రి సజ్జల స్క్రిప్ట్ ఇస్తే ఎమ్మెల్యేల నుంచి మంత్రులు వరుకు అది ఫాలో అవుతూ ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్లు తిడుతున్నారని చెప్పారు.
వైసీపీ నాయకులు నోటికొచ్చినట్లు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తారు. కార్పొరేటర్ నుంచి మంత్రులు వరకు ఒకేలా మాట్లాడతారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలు మీద మాట్లాడితే మీరంతా ఎందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతారని నా సన్నిహితుల ద్వారా వాళ్లని అడిగితే వాళ్లంతా ఒకటి చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశిస్తే, సజ్జల ఎలా తిట్టాలో స్క్రిప్ట్ ఇస్తారు. దానిని మేము ఫాలో అవుతాం అంతే తప్ప మాకు పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఎందుకు ఉంటుంది అని అన్నారు అని నాగబాబు తెలిపారు.
ఈ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. తొందరెందుకు అని వ్యంగ్యంగా ప్రగల్భాలు పలికారు. ఆ తరవాత ఆయన కనిపించకుండాపోయాడు. ప్రభుత్వ చేతకానితనం వల్ల నిరుద్యోగ సమస్య ఏర్పడితే… ఎక్కువ మంది చదువుకోవడం వల్ల సమస్య ఏర్పడిందని మాట్లాడటం వైసీపీ వాళ్లకే చెల్లింది. వీళ్లంతా కలిసి ప్రజలను పీడిస్తున్నారు అని నాగబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.