Pawan Election Campaign in Telangana : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఏ పార్టీకి ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్తూ సభలు పెడుతూ బిజీ,బిజీ గా ఉన్నారు. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. బిజెపితో జనసేన పొత్తుమాట మనకు తెలిసిందే, ఎనిమిది చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బిజెపితో కలిసి ప్రచార సమన్వయం చేసుకొని ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మాత్రం ఎటువంటి ప్రచారంలో పాల్గొనలేదు. అసలు తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారా..? లేదా..? అనేది ఇప్పుడు సందిగ్ధ పరిస్థితి.
అయితే బిజెపితో పొత్తు కుదిరిన తర్వాత జనసేనకు ఎనిమిది స్థానాలను కేటాయించారు. మొన్న ప్రధాని మోడీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ పాల్గొన్నారు. చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అయితే తెలంగాణలో పోలింగ్ తేది సమీపిస్తున్న కూడా పవన్ ఎటువంటి ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే పవన్ తెలంగాణలో ప్రచారానికి వస్తున్నారంటూ ఒక టాక్ బయటకు వచ్చింది.
జనసేన అభ్యర్థుల గెలుపు బాధ్యతలను పవన్ తీసుకుంటున్నారని కూడా ప్రచారం ప్రారంభమైంది. ఖమ్మంలో ఒక రోడ్ షో, అలాగే గ్రేటర్ లో రెండు రోడ్ షోలలో పవన్ పాల్గొంటారని వినికిడి. అలాగే ర్యాలీలకు సైతం ఆయన హాజరుకానున్నట్లు తెలుస్తుంది. కానీ జనసేన మాత్రం ఇప్పటివరకు ఈ విషయం పైన ఎటువంటి అధికార ప్రకటన చేయకపోవడం గమనార్హం.
దాంతోపాటు ఇటు బిజెపికి అటు జనసేన అభ్యర్థులు కూడా పవన్ ప్రచారం చేస్తున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి, కానీ అందులో వాస్తవం ఎంతో తెలియదు. పవన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ప్రచారం ఎలా సాగిస్తారో వేచి చూడాల్సిందే..