Pawan Kalyan – Chandrababu : ప్రాథమిక ఆధారాలు కూడా చూపించకుండా అర్ధరాత్రులు అరెస్టు చేసే విధానాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబరులో విశాఖపట్నంలో మా పార్టీ పట్ల పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ప్రజలందరూ చూశారు. హత్యాయత్నం కేసులు పెట్టి మా జనసేన నాయకులను జైళ్ళలో పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి పట్ల నంద్యాలలో వ్యవహరించిన విధానం కూడా అలాంటిదే.
ఆయన అరెస్టును సంపూర్ణంగా ఖండిస్తున్నాం. అప్రజాస్వామిక పాలనకు అద్దంపడుతోంది. రాజకీయ కక్ష లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని జనసేన భావిస్తోంది. ప్రతిపక్షాలను అణచివేయాలనే వైసీపీ విధానం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యవహరించిన తీరు, చిత్తూరులో ఘటనలు చూస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. వైసీపీ పార్టీ నాయకులు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మా పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం అంటున్నారు.

మాకు అర్ధం కాని విషయం ఏమిటంటే- లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసు వ్యవస్థ కదా… దాంతో వైసీపీ వాళ్ళకు సంబంధం ఏంటి? అసలు వైసీపీ పార్టీ వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. మళ్లీ వాళ్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. ఒక పార్టీ అధినేత అరెస్టు అయితే వాళ్ల నాయకులు, అనుచరవర్గం బయటకు వస్తారు. అది ప్రజాస్వామ్యంలో భాగం. ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ నిరసన చెబుతారు. వాళ్ళ నాయకుడికి మద్దతు తెలపొద్దు అంటే ఎట్లా?
వైసీపీ నాయకులు మాత్రం అక్రమాలు, దోపిడీలు చేసి జైళ్లకు వెళ్తారు. ఆ తరవాత విదేశాలకు వెళ్లొచ్చు. ఏ తప్పూ చేయకపోయినా ఇతర పార్టీ నాయకులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు పెట్టడం ఏమిటి? ఇది శాంతిభద్రతల సమస్య కంటే కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగమే. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును ఖండిస్తూ దీని నుంచి బయటపడాలని కోరుకొంటూ సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నారు.
