Pawan Kalyan – Gaddar : గద్దర్ అన్న మరణం ఊహించనిది అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజా గాయకుడు గద్దర్ గారి మరణవార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం గద్దర్ గారి భౌతికకాయాన్ని సందర్శించి, ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటాలకు గద్దర్ అన్న గొంతు ఒక ప్రేరణ బాట. జనసేన పార్టీ పెట్టడానికి కూడా ఆ యోధుడి గొంతు నుంచి వచ్చిన ఎన్నో పాటలు నాలో స్ఫూర్తి రగిలించాయి. కళ ద్వారా కోట్లాదిమందిని కదిలించవచ్చని నిరూపించారు.
చాలాసార్లు మృత్యువుతో సైతం యుద్ధం చేసి, గెలిచిన గొప్ప గాయకుడు గద్దర్ గారు. ఈసారి కూడా ఎంతో ఆరోగ్యంగా తిరిగి వస్తారని భావించాను. ఇటీవల ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన వెంటనే హైదరాబాదులోని ఆసుపత్రికి వెళ్లి పరామర్పించాను. ఆరోగ్యం బాగా లేని సమయంలో కూడా ఆయన ప్రజల బాగు కోసం ఆలోచించారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్నో విషయాలను బలంగా తట్టుకునే నాకు ఈ సమయంలో దుఃఖం ఆపుకోవడం సాధ్యం కావడం లేదు అని పవన్ అన్నారు.
ఆపరేషన్ సమయంలో కూడా నాకు ప్రత్యేకంగా ఆయన వాయిస్ మెసేజ్ పంపారు. పీడిత ప్రజల పక్షాన పోరాడే వారు అంటే గద్దర్ అన్నకు ప్రాణం. అలాంటి వారితోనే ఆయన ఎక్కువ గడిపారు. చివరి శ్వాస వరకు ఆయన మనసులో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేయాలని గట్టి సంకల్పం నాకు కనిపించింది. పరిపూర్ణ పోరాటం అంటే పీడిత ప్రజలకు ఖచ్చితంగా మేలు చేసేది అయి ఉండాలి అని గద్దర్ అన్న నమ్ముతారు. దానిని తుది శ్వాస వరకు ఆయన వీడలేదు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ తిరిగి వస్తారని గట్టిగా నమ్మాను.
చివరిసారి నా పాటకు గాయం అయింది అని ఆయన చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది. పీడిత ప్రజల పక్షాన తన పాటతో ఎన్నో చైతన్య కాంతులు నింపిన గద్దర్ అన్న చివరకు పీడిత ప్రజలకు పూర్తి స్థాయిలో మేలు జరగలేదు అని, తన పాటకు గాయం అయిందని నాకు లెటర్ లో వ్రాసి మధనపడ్డారు. గాయపడ్డ పాట అని గద్దర్ అన్న రాసినపుడు నాకు ఎంతో ఆవేదన కలిగింది. మీరు ఎప్పుడు ఆ మాట అనకండి… మేమంతా మీ స్ఫూర్తిని బతికించేలా పనిచేస్తామని గుండెలకు హత్తుకొని మరి చెప్పాలని భావించాను.
అయితే అది తీరకుండానే గద్దర్ అన్న పాట అమరత్వం పొందింది. అజ్ఞాత సమయంలో గద్దర్ అన్న పొందిన భావాలు, ఉద్వేగ క్షణాల నుంచి పుట్టిన పాటలు మీద ఎన్నో గంటలు చర్చించేవాళ్ళం. ఆయన చెప్పే ప్రతి అంశం కూడా ఎంతో విలువైనది. చిన్న వయసు నుంచి నాలో స్ఫూర్తి నింపి ఎంతో ప్రేరణ కల్పించిన వ్యక్తిని కోల్పోయాను అన్న బాధ నాలో అణువణువునా ఇప్పుడు ఉంది. మహాకవి శ్రీశ్రీ తర్వాత నాలో ఎన్నో విప్లవ భావాలు రగిలించిన వ్యక్తిని ఇప్పుడు కోల్పోవడం నాకు ఆవేదన ఉంది అని పవన్ కళ్యాణ్ విచారాన్ని వ్యక్తం చేశారు.