Pawan Kalyan : జనసేన సిద్ధాంతాలను అర్ధం చేసుకొని, భవిష్యత్తు తరాలకు అండగా నిలబడాలనే సదుద్దేశంతో పార్టీలోకి వచ్చే ఏ నాయకుడినైనా సాదరంగా ఆహ్వానిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాంటి లక్ష్యంతో ముందుకు వచ్చి జనసేన పార్టీలో చేరిన శ్రీమతి పడాల అరుణ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని, ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి బలమైన నాయకురాలు రావడం పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పారు.
గురువారం ఉదయం విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మాజీ మంత్రి శ్రీమతి పడాల అరుణ కుటుంబసమేతంగా జనసేన పార్టీలో చేరారు. శ్రీమతి అరుణ గారికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ.. చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం నుంచి శ్రీమతి పదాల అరుణ గారు మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు.
ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై నిలదీసిన ఆమె పోరాట స్ఫూర్తి జనసేన పార్టీకి ఎంతో అవసరం. ఏ పదవి ఆశించకుండా భవిష్యత్తు తరాల కోసం జనసేన పార్టీ నాయకులు పడుతున్న కష్టాల చూసి ప్రభావితమై పార్టీలోకి వచ్చానని ఆమె చెప్పడం చాలా ఆనందం కలిగించింది” అన్నారు. మాజీ మంత్రి శ్రీమతి పడాల అరుణ గారు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోయే తరానికి కాబోయే నాయకుడు.
వచ్చే తరానికి ఒక అద్భుతమైన మార్గదర్శకం చేయాల్సిన సరికొత్త నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తూ, అక్రమార్కులను ఎండగడుతూ. ఆయన సాగిస్తున్న ప్రయాణంలో నేను భాగస్వామురాలిని కావడం ఆనందంగా ఉంది. పార్టీ ఉన్నతి కోసం సాయశక్తుల పని చేస్తాను. ఓ సోదరుడి నాయకత్వంలో నిస్వార్ధంగా పని చేసే కార్యకర్తగా ముందుకు వెళ్తాను అన్నారు.