Pawan Kalyan : అశేష జనవాహిని మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ఎంతో విజయవంతంగా నడుస్తుంది. ప్రతి చోట ప్రజలు పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పడుతున్నారు. అభిమానులు వెల కట్టలేని అభిమానంతో ఆయన్ని తడిసి ముద్దయ్యేలా చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో రధం వారాహి విజయవాదం చేస్తూ పరుగులు పెట్టింది. ఆశేష జన వాహిని పిఠాపురం పురవీధుల్లో వారాహి విజయ యాత్రలో పాల్గొని బ్రహ్మరథం పట్టారు.
వేలాదిగా తరలివచ్చిన జనసైనికుల కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ గారు వారాహిపై నిల్చొని విజయయాత్ర చేపట్టారు. పిఠాపురం పుర వీధులన్నీ జనప్రవాహంతో నిండిపోయాయి. పలువురు జనసేన నాయకులు వారాహి మీద పూల వర్షం కురిపించగా జనసైనికుల జయ జయధ్వానాల మధ్య పవన్ కళ్యాణ్ యాత్ర సాగింది. రెండు కిలోమీటర్ల మీద రోడ్ షో నిర్వహించారు. వారాహియాత్ర ప్రారంభాన పిఠాపురం మహిళలు పసుపు, కుంకుమలు చల్లి, నీళ్లు వార పోశారు.
అక్కడి నుంచి జన ఉప్పెన రక్షణ కవచంగా అడుగులు వేయగా జనసేన వారాహి విజయ యాత్ర మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ తన కోసం వచ్చిన అభిమాన సంద్రానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పలువురు జనసేన నాయకులు వారాహి రధం ముందు నడిచారు. బస్టాండ్ సెంటర్ నుంచి మొదలైన జనసేన వారాహి విజయయాత్ర పిఠాపురం మెయిన్ రోడ్డు, కోట గుమ్మం సెంటర్, పల్లపు వీధి మీదుగా ఉప్పాడ బస్టాండ్ వరకు సాగింది.
పవన్ కళ్యాణ్ గారి యాత్ర సాగిన రెండు కిలోమీటర్ల రహదారి ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్న తమ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ పిఠాపురం ప్రజలు దారిపొడుగునా ఫ్లకార్డులు ప్రదర్శించారు. మరికొంత మంది తమ సమస్యలను ప్లకార్డుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ పీరాపురం నుంచి పోటీ చేయాలంటూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పలువురు పోస్టర్లు ఏర్పాటు చేశారు.
పిఠాపురం పట్టణం మొత్తం పవన్ కళ్యాణ్ గారి స్వాగత తోరణాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నిండిపోయింది. బహిరంగ సభ ప్రాంగణం వద్ద జనసేనాని ప్రసంగం వినేందుకు తరలివచ్చిన జనప్రవాహంతో కిక్కిరిసిపోయింది. అటు కాకినాడలోను పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం లభించింది. పీఠాపురం సభ ముగించుకుని వారాహి విజయయాత్ర నిమిత్తం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ కి నగర శివార్లలో పార్టీ శ్రేణలు ఘనస్వాగతం పలికాయి. శనివారం నుంచి వారాహి యాత్ర కాకినాడ రూరల్, నగర నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతుంది.