Pawan Kalyan – Teacher’s Day : సెప్టెంబర్ 5వ తేదీన “టీచర్స్ డే” సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురుదేవుల్లకు శుభాకాంక్షలు తెలిపారు. జన్మనిచ్చిన అమ్మానాన్నల తరవాత మనకు అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరే. వీసమెత్తు కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి… తమ శిష్యుల విజయాలను తమవిగా భావిస్తారు. పవిత్రమైన బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసే ఉపాధ్యాయులు, అధ్యాపకులు- శిష్యులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది, మన దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్ధంగా పోషించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు పవన్ కళ్యాణ్. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల ఆంధ్రప్రదేశ్ పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోంది. ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తూనే ఉంది. ప్రభుత్వ చర్యలు సైతం అందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. బోధనేతర విధులతో వారిని ఇబ్బందుల పాలస్తోంది.
నాడు-నేడు పనుల్లో పాలక పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30వేల మంది ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో ఏ ఉపాధ్యాయుడికి ఇంకా జీతం చెల్లిందలేదు. అంటే ఈ ప్రభుత్వానికి గురు దేవుళ్లపై ఏ విధమైన ధోరణిని అవలంభిస్తోందో అర్ధమవుతోంది. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవమర్యాదలను కాపాడుతుంది అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.