Band Melam: ‘కోర్ట్’ హిట్ తర్వాత మళ్లీ అదే జంట.. రోషన్, శ్రీదేవిల ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్ రిలీజ్
Band Melam: 2025లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ జంట రోషన్, శ్రీదేవి మరోసారి తెరపై రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. మొదటి చిత్రంతోనే తమ సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్న ఈ జంట, ఇప్పుడు తమ రెండో సినిమా ‘బ్యాండ్ మేళం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాను ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘చేనుకాడ ఉందో జాబి మొగులాలి..’ అనే మధురమైన పాటతో గ్లింప్స్ మొదలవుతుంది. ఇందులో హీరో రోషన్ తన ప్రియురాలు శ్రీదేవి కోసం ‘రాజమ్మ’ అంటూ ఇల్లంతా వెతుకుతుంటాడు. ఆ తర్వాత కనిపించే సన్నివేశంలో శ్రీదేవి పూలు కోస్తుండగా, రోషన్ అదే పేరుతో పిలవడంతో ‘అలా పిలిస్తే గునపంతో గుద్దుతా’ అంటూ కోపంగా బెదిరిస్తుంది. దీనిని బట్టి శ్రీదేవి పాత్ర పేరు రాజమ్మ అని, ఆమె పాత్ర చాలా అల్లరిగా ఉంటుందని అర్థమవుతోంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఇందులో కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి చంద్రబోస్ సంగీతం అందిస్తుండగా, సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్ ఈ గ్లింప్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ‘మొదటి బీట్ మీ అందరికీ అందిస్తున్నాం. ఇది మీ హృదయానికి దగ్గరవుతుంది’ అని పేర్కొన్నారు. ‘కోర్ట్’ సినిమాలో వీరిద్దరి మధ్య వెన్నెల, చందుల కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలోని ‘తప్పులేదు ప్రేమలో’ పాట ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ కొత్త చిత్రంతో ఈ యువ జంట మరోసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
