Mirai OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బాక్సాఫీస్ సంచలనం ‘మిరాయ్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Mirai OTT: యంగ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన పౌరాణిక ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయాన్ని అందుకుంది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషించి, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ సంచలనం ఇప్పుడు డిజిటల్ తెరపైకి రాబోతోంది.
స్ట్రీమింగ్ తేదీ ఖరారు
‘మిరాయ్’ చిత్రం అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా (JioCinema) లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులోకి రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు, ముఖ్యంగా తేజ సజ్జా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మిరాయ్: కళింగ యుద్ధం నుంచి కైవల్యం వరకు…
‘మిరాయ్’ చిత్రం కథా నేపథ్యం ఆసక్తికరంగా ఉంటుంది. కళింగ యుద్ధం తర్వాత జరిగిన రక్తపాతాన్ని చూసి చలించిపోయిన అశోక చక్రవర్తి, తనలోని దైవిక శక్తులన్నింటినీ తొమ్మిది రహస్య గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. ఈ గ్రంథాలు దుష్టులకు దొరకకుండా, సృష్టికి అనర్థం జరగకుండా ఉండేందుకు ఎనిమిది గ్రంథాలను ఎనిమిది మంది యోధులకు అప్పగించి, తొమ్మిదో గ్రంథాన్ని ఓ పవిత్ర ఆశ్రమానికి అందిస్తాడు.
అయితే, తాంత్రిక విద్యల్లో నిష్ణాతుడు, అమరత్వ సిద్ధి పొందాలనుకునే దుర్మార్గుడు బ్లాక్స్వార్డ్ ఆ తొమ్మిది గ్రంథాలను దక్కించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన తొమ్మిదో గ్రంథం రక్షకురాలు అంబిక (శ్రియ శరణ్), బ్లాక్స్వార్డ్ను అంతం చేసే శక్తి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకే ఉందని అగస్త్య మహాముని ద్వారా తెలుసుకుంటుంది. ఆ బిడ్డ పుట్టగానే, ఆమె శిశువును కాశీలో అనాథగా వదిలి వెళ్ళిపోతుంది.
అలా పెరిగిన ఆ యువకుడే వేద (తేజ సజ్జా). 24 ఏళ్ల వయస్సులో వేద తన జన్మ రహస్యాన్ని తెలుసుకోవడం, బ్లాక్స్వార్డ్ ఎనిమిది గ్రంథాలను కైవసం చేసుకుని, తొమ్మిదో గ్రంథం కోసం ప్రయత్నించడం కథలో కీలక మలుపులు. చివరకు, వేద ‘మిరాయ్’ గ్రంథాన్ని ఎలా సాధించాడు, అసాధారణ యోధుడిగా ఎలా మారి బ్లాక్స్వార్డ్ను అంతం చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. థియేటర్లలో చూడలేని వారు, ఇప్పుడు ఓటీటీలో ఈ విజువల్ వండర్ను ఆస్వాదించవచ్చు.
