Ashada Masam : హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాడమాసంలో వచ్చే ఏకాదశినీ, తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటారు. హిందూ ఆచారం ప్రకారం ఆషాడ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆషాడ శుద్ధ పౌర్ణమినాడు జగన్నాథ రథయాత్రను నిర్వహించి మహాభారతాన్ని రచించిన వ్యాస భగవానుడిని ఆరాధించే పండగను ఆషాడ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి రోజునే జరుపుకుంటారు. ఇలా ఆషాడమాసం ఎన్నో పర్వదినాలను మోసుకొస్తుంది.
ఆషాడంలో మనకు తెలిసినంతవరకు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు అంటే శుభకార్యాలేవి జరగవు. ఆషాడమాసాన్ని శూన్యమాసం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. తెలంగాణలో అయితే ఆషాడమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఒక పెద్ద పండగ లాగా జరుపుకుంటారు. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో కొత్త ఏడాది మొదలై పాల్గొన మాసంతో ముగుస్తుంది.
ఈ క్రమంలో వచ్చే నాలుగో నెలను ఆషాడమాసంగా పరిగణిస్తారు. ఈ ఆషాడ మాసంలో కొన్ని కట్టుబాట్లు కూడా ఉంటాయి. అవి ఏమిటంటే కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ ఆషాడ మాసంలో కలవకూడదు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపించేస్తారు. అయితే దీని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. ఆషాడమాసం రాగానే మనం గమనించినట్లయితే చాలామంది మహిళలు గోరింటాకును గౌరీదేవికి ప్రతీకగా భావించి పెట్టుకుంటూ ఉంటారు.
గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనారోగ్యం భారి నుండి మనం రక్షింపబడతామని ఆయుర్వేదం తెలుపుతుంది. వ్యవసాయానికి ఈ ఆషాడ మాసం చాలా అనుకూలమైనది. ఈ ఆషాడ మాసంలో యాగం నిర్వహించడం వల్ల కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మనం రక్షింపబడతాము అని పురాణాలు తెలుపుతున్నాయి.
ఆషాడమాసం ప్రారంభం కాగానే హైదరాబాదులోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఆలయంలో తొలిపూజ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగను జరుపుకుంటారు. ఈ తొలిబోనం సమర్పించే ఆనవాయితీ కుతుబ్ షా కాలం నుంచి రావడం గమనార్హం. ఆషాడమాసాన్ని శూన్యమాసంగా పరిగణించే ఈ నెలలోనే ఇన్ని విశిష్టతలు జరగడం విశేషం.