శోభన్ బాబు – పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆ కథ విని స్పందించలేదు.
ఏంటా కథ? అసలింతకీ ఏం జరిగింది?
అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది.దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది.టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ కలిగిన హీరో. తను కోరుకుంటే సంవత్సరానికి 3 సినిమాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. కానీ తన భిన్నమైన ఆలోచన సరళితో చాలా తక్కువ చిత్రాలలో నటించాడు. అదే టైంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను కాదనుకున్నాడు అన్నది ఇటు ఫ్యాన్స్ కి, అటు ఇండస్ట్రీ వర్గాలకి తెలిసిన విషయమే.
2001 ఏప్రిల్ 27 న ఖుషి చిత్రం విడుదల అయింది.కట్ చేస్తే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ స్టార్డం ఆకాశాన్ని తాకింది ఈ చిత్రంతో. దాంతో పవన్ కళ్యాణ్ తరువాత చిత్రం ఎలా ఉంటుంది అనే ఆసక్తి తో అటు ఇండస్ట్రీ వర్గాలు,ఇటు ఆయన అభిమానులుఎదురుచూస్తున్న సమయం అది. ఎక్కువ మంది ఏ పెద్ద డైరెక్టర్ తోనో సినిమా చేస్తాడు అని చాలా అంచనాలలో ఉన్నారు. కానీ పవన్ దానికి భిన్నంగా తన స్వీయ దర్శకత్వంలో జానీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ సినిమా ప్రొడక్షన్ టైం లో అప్పటికే తన రచనలతో ఉత్తమ రచయితగా రెండు నంది అవార్డులు అందుకున్న పవన్ చిరకాల ప్రాణ మిత్రుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి ఒక కథ చెప్పాడు.
ఆ కథ చెబుతుంటే స్టూల్ మీద కూర్చున్న పవన్ కళ్యాణ్ వెనుక ఎలాంటి ఆధారం లేకుండా అలాగే నిద్ర పోయాడు. దానర్ధం సింపుల్ పవన్ కళ్యాణ్ కి కథ అంతగా నచ్చలేదు. తమ మద్య ఉన్న స్నేహ బంధం వలన ఆ విషయం అర్థం చేసుకోని ఇంకో కథ సిద్ధం చెస్తానని త్రివిక్రమ్ అక్కడి నుండి వచ్చేసాడు.ఇదే విషయం పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు సభాముఖంగా చెప్పారు.
కట్ చేస్తే ఇంకో హీరోకి అదే కథ వినిపించారు.ఆ హీరో కూడా కథ విని ఏం మాట్లాడకుండా లేచి బయటకు వెళ్ళిపోయాడు. కథ నచ్చలేదేమో అనుకున్నాడు త్రివిక్రమ్. పది నిమిషాల తర్వాత లోపలికి వచ్చి ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా మనం చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పేసాడు. ఈ సారి షాక్ అవ్వడం త్రివిక్రమ్ వంతయింది.
అప్పటికే ఇంకొక కథతో వేరే సినిమా ఒప్పుకొని ఉండటం వల్ల అది పూర్తి చేసి రావడానికి త్రివిక్రమ్ కి రెండు సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఆ హీరో ఇచ్చిన కమిట్మెంట్ కట్టుబడి సినిమా ప్రారంభించాడు. అందరి నటీనటుల ఎంపిక పూర్తయింది. చివరగా మిగిలింది ఒకే ఒక పాత్ర. చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర. ఎంత ప్రయత్నించినా ఆ పాత్రకు తగిన నటుడి అన్వేషణ కొలిక్కిరావడం లేదు. బరువైన భావోద్వేగాలు కలిగిన ఆ పాత్ర కోసం 1996 లో హలో గురు చిత్రం నిరాశపరచడంతో సినిమాలకు గుడ్ బై చెప్పి చెన్నైలో స్థిరపడిపోయిన ఒకప్పటి అందాల నటుడు శోభన్ బాబు గారి తలుపు తట్టింది. కానీ ఆయన మొండి మనిషి, ఒక నిర్ణయం తీసుకుంటే వెను తిరిగి చూసి ప్రసక్తే లేదు. అందాల నటుడిగా తాను ప్రేక్షకులను అలరించాను. ప్రేక్షకుల మనసులో ఆ రూపాన్ని అలాగే ఉండనివ్వండి, మీరు అడుగుతున్న ఆ పాత్రని నేను చెయ్యలేను అని సున్నితంగా తిరస్కరించారు.
ఇప్పుడు బాల్ మళ్ళీ త్రివిక్రమ్ కోర్టులోకి చేరింది. ఈసారి ఆయన పెద్దగా ఆలోచించలేదు. 60 ఏళ్ళు పైబడిన ఆ పాత్ర కోసం 40 ఏళ్ళ వయసున్న తమిళ నటుడు నీ సంప్రదించి ఆయనను ఓకే చేసుకొని సినిమా మొదలు పెట్టాడు.ఆ 60 ఏళ్ల వ్యక్తి పాత్రకు దగ్గరుండి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు గారి చేత తనకి కావాల్సినట్టు డబ్బింగ్ చెప్పించుకున్నాడు త్రివిక్రమ్.
ప్రొడక్షన్ వాళ్ళు సినిమా మొదలైన తేదీ నుండి
6 నెలలలోపు రిలీజ్ అనుకున్నది కాస్తా రెండు సంవత్సరాలు పట్టింది. అనుకున్న బడ్జెట్ పరిమితులు దాటి సినిమా కి ఖర్చు పెట్టాల్సి వచ్చింది.ఎట్టకేలకు 2005 ఆగస్టు 10 సినిమా విడుదలైంది. ప్రేక్షకులు ఆ చిత్రానికి బ్రహ్మరథం పట్టి ఘన విజయన్ని అందించారు. జోరుగా కురుస్తున్న వర్షాలలో బయ్యర్లకు కనకవర్షం కురిపించింది.
ఇప్పటికే మీకు అర్థం అయి ఉండాలి ఆ చిత్రం ఏదో.. అదే అతడు చిత్రం. ఇప్పటికీ వందల సార్లు పైబడి టెలివిజన్లో ప్రదర్శించినా టీఆర్పి రేటింగ్ ఏ మాత్రం తగ్గని చిత్రం. అసలైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం. ఇప్పుడు అసలు విషయం లోకి వస్తే కథ వింటూ స్టూల్ పైన నిద్రపోయి పవన్ కళ్యాణ్ వదులుకున్న పాత్ర మహేష్ బాబు చేశారు. ఒకప్పుడు హీరోగా వెలిగి తండ్రి పాత్రలు నేను చేయలేను అంటూ శోభన్ బాబు గారు వదులుకొన్న పాత్ర నాజర్ చేశారు. ఆ పాత్రలు వారిద్దరు చేసుంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి.
ఆ తరువాత త్రివిక్రమ్ పవన్ జల్సా చిత్రం కలిసి పని చేశారు. ఆ చిత్రానికి ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. అతడు వదులుకున్నందుకు చాలా మంది పవన్ అభిమానులకి కోపం రాక మానదు. ప్రస్తుతం చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు తెరిచిన వెంటనే విడుదలయ్యే భారీ చిత్రం అదే. వకీల్ సాబ్ త్వరలోనే విడుదలై అభిమానులను అలరించాలని ఆశిద్దాం.