కన్నీళ్లు తెప్పిస్తున్న ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ కష్టాలు…ఆమె కోసం పేమెంట్ మొత్తం ఇచ్చేసిన హైపర్ ఆది
జబర్దస్త్ కమెడియన్ గా పరిచయం అయిన హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో సైతం రాణిస్తున్నారు. బుల్లితెరపై జోకులు వేసే హైపర్ ఆది అప్పుడప్పుడూ ట్రోలింగ్ కి గురి అవుతుంటాడు. హైపర్ ఆది వేసే కొన్ని కామెడీ పంచ్ లో డబుల్ మీనింగ్ ని తలపించేలా ఉంటాయి. అందుకే అతడిపై కొందరు విమర్శలు చేస్తుంటారు. అయితే తన ఒరిజినల్ క్యారెక్టర్ వేరని.. స్టేజిపై చేసేదంతా నవ్వించడం కోసమే అని హైపర్ ఆది ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు.
తాజాగా మరోసారి హైపర్ ఆది గొప్ప మనసు బయట పడింది. హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో సైతం పాల్గొంటున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రసారం కాబోయే ఈ షో ప్రోమో విడుదలయింది. ఈ షోకి బిగ్ బాస్ శివాజీ, ఇటీవల సంచలనం గా మారిన కుమారి ఆంటీ తో పాటు గత ఏడాది ఏషియన్ గేమ్స్ లో అథ్లెట్ గా బ్రాంజ్ మెడల్ గెలుచుకున్న తెలుగు అమ్మాయి నందిని అగసర అతిథులుగా హాజరయ్యారు.
సాధారణంగా ఏషియన్ గేమ్స్ వరకు వెళ్ళింది అంటే ఆమెకి ఆర్థికంగా ఎలాంటి లోటు లేదని భావించడం సహజమే. కానీ నందిని పరిస్థితి వేరు. వారి కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. ఒక దశలో నందిని గాయానికి గురైనప్పుడు పూట గడవడమే కష్టం అయ్యేదట. ఈ విషయాన్ని నందిని భావోద్వేగానికి గురవుతూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తెలిపింది.
దీనితో హైపర్ ఆది తో పాటు అక్కడున్న వారంతా చలించిపోయారు. వెంటనే హైపర్ ఆది తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇంటి నిండా మెడల్స్ కొట్టిన అమ్మాయికి కడుపు నిండా అన్నం దొరక్క పోవడం నిజంగా బాధాకరం. కాబట్టి ఒక ఎపిసోడ్ పేమెంట్ మొత్తాన్ని నందినికి ఇవ్వబోతున్నట్లు హైపర్ ఆది ప్రకటించారు. దీనితో అక్కడున్న వారంతా హైపర్ ఆది నిర్ణయాన్ని అభినందించారు. నటి ఇంద్రజ కూడా తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చింది.
దీనితో అంతా హైపర్ ఆది గొప్ప మనసుని కొనియాడుతున్నారు. వేదికలపై కామెడీ పంచ్ లు వేసే హైపర్ ఆది పర్సనల్ లైఫ్ లో మంచి మనసున్న వ్యక్తి అని అభినందిస్తున్నారు.