Niharika Konidela : ఏపీలో తన ఓటు హక్కు గురించి నిహారిక షాకింగ్ కామెంట్స్.. కొత్త ఇల్లు కూడా తీసుకుంటాం అంటూ
మెగా డాటర్ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత జీవితంలో ఇబ్బందుల వల్ల నిహారిక వార్తల్లో కెక్కింది. సోషల్ మీడియాలో తనపైన నెగిటివిటి ఉన్నప్పటికీ నిహారిక హుందాగా వ్యవహరించింది. ప్రస్తుతం నిహారిక నటిగా మరింత గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక చేసిన పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని బలంగా నిలబెట్టే వ్యూహ రచనలో ఉన్నారు. పవన్ వెంట నాగబాబు జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా తిరుగుతున్నారు. నేడు కూడా నాగబాబు జనసేన కార్యాలయంలో కార్యకర్తల కుటుంబాలకు భీమా చెక్కులు పంపిణి చేశారు.
ఇదిలా ఉండగా నిహారికకి ఇంటర్వ్యూలో రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ గురించి మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా.. నాకు ఏపీలో ఓటు హక్కు ఉంది. కానీ ఇటీవల రద్దు అయింది. ఎందుకు రద్దు చేశారో కారణాలు తెలియదు. కానీ నేను ఏపీలోనే ఓటు వేస్తా అని నిహారిక తెలిపింది. నాన్న ఎన్నికల్లో పోటీ చేసేది కంఫర్మ్ అయితే అక్కడే ఇల్లు తీసుకుంటాం. లేకుంటే ఏపీలో ఏదో ఒకచోట ఇల్లు తీసుకుంటాం అని నిహారిక తెలిపింది.
ఇక జనసేన పార్టీ విషయానికి వస్తే నాన్న.. ఇంటికి రెండు వారాలకొకసారి వస్తున్నారు. కొన్నిసార్లు 5 నిముషాలు ఉండి వెళ్ళిపోతారు. అంత బిజీగా ఉన్నారు. ఇంటికి వచ్చినప్పుడు పాలిటిక్స్ గురించి నేనే మాట్లాడిస్తా. బాబాయ్ గురించి అడిగితే.. బాబాయ్ చాలా కష్టపడుతున్నాడు.. సరిగా తిండి, నిద్ర ఉండడం లేదు అంటూ తమ్ముడి మీద ప్రేమతో భాదపడుతూ చెబుతారు.
కళ్యాణ్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరో. అలాంటి వ్యక్తి అనవసరంగా రాజకీయాల్లో ఎందుకు ఇబ్బందులు పడడం అని కొందరు అంటుంటారు. కానీ మొదటి నుంచి కళ్యాణ్ బాబాయ్ ప్రజల మనిషి లాగే ఉన్నారు. సినిమాల్లో కూడా తన చుట్టూ ఉన్నవారెవరూ నష్టపోకూడదు అని భావించే వ్యక్తి. అలాంటి వ్యక్తి తప్పనిసరిగా రాజకీయాల్లో ఉండాలి అని నిహారిక పేర్కొంది.