‘యాత్ర 2’ అనుకున్నంత ప్రభావం చూపిందా.. వైసీపీకి ఒరిగిందేంటి ?
ఏ పని జరగాలన్నా అన్నీ కలసి రావాలి అంటారు. కొన్ని సార్లు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఇదంతా ఎందుకంటే యాత్ర 2 చిత్ర ప్రభావం గురించి. సరిగ్గా ఐదేళ్ల క్రితం మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర చిత్రం మంచి విజయం సాధించింది. ఆ సమయంలో వైఎస్ జగన్ హవా వేరు. ఆ గాలికి యాత్ర లాంటి సినిమా దొరకడంతో వైసీపీకి ఇంకొంత అదనపు అడ్వాంటేజ్ అయింది.
యాత్ర చూసిన వారు తప్పకుండా 2019 ఎన్నికల్లో ఈ చిత్ర ప్రభావం ఎంతో కొంత ఉంటుందని.. ఆ రకంగా మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు. అనుకున్నట్లే వైసీపీ 151 స్థానాలతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు యాత్ర 2 చిత్రాన్ని తీసుకువచ్చారు. అయితే ఐదేళ్ల క్రితం ఉన్న జోష్ ఏమాత్రం కనిపించడం లేదు. కొందరు వైసీపీ మద్దతు దారులు, అభిమానుల్లో తప్ప యాత్ర 2 గురించి ఎక్కడా చర్చ జరగడం లేదు.
దానికి కారణం మారిన పరిస్థితులు.. ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తి అనేది సినీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీకి మద్దతుగా సినిమా తీసినప్పుడు చాలా అంశాల్లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. బడ్జెట్ బిజినెస్ పరంగా లిమిటేషన్స్ ఉంటాయి. ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నమోదైన కలెక్షన్స్ 2.5 కోట్లు మాత్రమే. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులు 10 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే యాత్ర 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పేలా లేదు.
ఇది పక్కన పెడితే కలెక్షన్స్ ఎలా ఉన్నప్పటికీ కనీసం వైసీపీలో అయినా ఈ చిత్రం జోష్ నింపిందా అంటే అనుమానమే అని చెప్పాలి. యాత్ర 2 వైసీపీ పాజిటివ్ గా మారడం పక్కన పెడితే.. మరింత నెగిటివిటి పెంచేసింది. అందులో ఒక అంశం.. డైరెక్టర్ మహి వి రాఘవ్ కి ప్రభుత్వం రెండెకరాల భూమిని కేటాయించింది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాత్ర, యాత్ర 2 చిత్రాలని తెరకెక్కించినందుకు బదులుగా అతడికి లబ్ది చేకూర్చారు అని సోషల్ మీడియాలో ఇతర పార్టీల నుంచి ట్రోలింగ్ జరుగుతోంది.
ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నప్పుడు సినిమాలో చూపించిన అంశాలు కూడా గొప్పగా అనిపిస్తాయి. వ్యతిరేకత ఉన్నప్పుడు ఏం చూపించినా డబ్బా కొడుతున్నారు అంటూ విమర్శలు ఎదురవుతాయి. యాత్ర 2 చిత్రం విషయంలో ప్రస్తుతం జరుగుతోంది అదే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో హీరో జీవా నటించారు. ఇక వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు.