హీరో సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయాలని బిహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
సుశాంత్ మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని బిహార్ సీఎం నితీశ్కుమార్ నిన్న సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు గవర్నర్ ఫాగు చౌహాన్ కూడా అంగీకరించారు.
సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు తదుపరి దర్యాప్తును సీబీఐ చేపట్టాలని సూచించారు. నా తనయుడు మరణానికి సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తూ అతడి తండ్రి పాట్నా రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
మరోవైపు, ఈ కేసులో తనపై పట్నాలో దాఖలైన కేసు విచారణను ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ… ఈ కేసులో ఇరు వర్గాలు మూడు రోజుల్లోగా తమ సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.తదుపరి దర్యాప్తును వారం పాటు వాయిదా వేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదనీ.. హత్యకు గురయ్యారంటూ పలువురు రాజకీయ ప్రముఖులు ఆరోపిస్తున్నారు.
Discussion about this post