Andhra Pradesh Film Politics : రాజకీయ రంగం అంటేనే నేతలు చెప్పేది ఎంతవరకు నిజాలు అనేది నిగ్గు తేల్చడం చాలా కష్టతరమైన పని. ఒక పార్టీ మీద మరో పార్టీ దుమ్మెత్తి పోయడం. పార్టీని ఓడించడానికి రాజకీయంలో వేయని ఎత్తుగడ ఉండదు. రాజకీయంగా ఎదగడానికి అలాగే గెలవడానికి ఎన్నో పెడదారులు తొక్కుతుంటారు నాయకులు. ప్రజలకు మంచి చేసే వారి సంఖ్య వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అయితే ఒక పార్టీ మరో పార్టీ మీద బురద జల్లడానికి, కక్ష సాధింపు చర్యగా సినీ రంగాన్ని కూడా ఒక ఆయుధంగా ఎంచుకుంటుంది.
ఈ పరంపర ఎన్నో ఏళ్లుగా సాగుతుంది. ఈ మధ్య అది కాస్త పరాకాష్టకు చేరిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో సినీరంగము నుండి వెలువడుతున్న సినిమాలు అక్కడి రాజకీయ నాయకుల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు తారుమారు అయ్యాయి అని చెప్పవచ్చు.
జగన్ పార్టీ, మరోవైపు టిడిపి అధినేత ఓటమి, ఇంకోవైపు జనసేన అనుకోని విధంగా దూసుకు రావడం. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాయి. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాతో ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్ ని ఒక కుదుపు కుదిపాడు. రాంగోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంది.
దీనిపైన టిడిపి నాయకులు తీవ్రమైన విమర్శలు చేసి, రాంగోపాల్ వర్మ ఆఫీస్ ముందు నిరసన తెలిపి సినిమా విడుదలను అడ్డుకున్నారు. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ సినిమా ఒత్తిడిని ఎదుర్కొంది. అయితే తాజాగా దీనికి దీటుగా ఇప్పుడు మరో సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా పేరు “రాజధాని ఫైల్స్” ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా విలన్ గా చూపించే విధంగా సినిమాను రూపొందించారని ఒక కొత్త చర్చ ముందుకు వచ్చింది.
తెలుగు వన్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా విడుదల అవుతున్నట్టుగా ఒక ట్రైలర్ అకస్మాత్తుగా దర్శనమిచ్చింది. అసలు ఈ సినిమా ఎప్పుడు నిర్మితమైంది. ఇప్పుడు ఇలా రిలీజ్ అవ్వడం ఏంటి అని ట్రైలర్ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యం పోతున్నారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కాలేదు. ఒకరకంగా చూస్తే సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అంగీకారం తెలిపినట్టుగానే కనిపిస్తుంది.
ట్రైలర్ ని గనక గమనిస్తే శాసనసభలో అత్యంత అసభ్య పదజాలన్ని వాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడే ఒక కొత్త రచ్చ మొదలైంది. వ్యూహం సినిమాకి అంగీకరించని ఇబ్బందులు కలిగించిన సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎలా ఆమోదం తెలిపింది. అసలు రాజకీయాలు సినిమాలతో ముడిపడి ఉండడం ఏమిటి..? ఈ రకంగా ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడం ఏమిటి..? అని చర్చ నడుస్తుంది.
సినిమాల విషయాన్ని పక్కకు పెడితే ఇప్పుడు అసభ్య పదజాలం అనే వార్త బాగా చర్చనీయాంశంగా మారింది. మనము కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు వారికి ఉన్నటువంటి ప్రతిపక్షాల మీద కోపాన్ని అసభ్య పదజాలంతో మీడియా ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. అది ప్రజల్లోకి ఏ విధంగా చోచ్చుకుపోతుంది, ఎంతటి అనర్ధాలకు దారితీస్తుంది అనేది మాత్రము రాజకీయ నాయకులు గమనించరు.
ఇది అధికారపక్షమైన, ప్రతిపక్షమైన ఇద్దరికి వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలు ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా తీసుకుంటూ ఇంకా ఇలాంటి గొడవలకు ఆజ్యం పోస్తున్నారు. ప్రజల బాగోగులను ఆలోచించేవాడే రాజకీయ నాయకుడు. కానీ ఆ విషయాన్ని పక్కనపెట్టి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ, దాడులు చేసుకుంటూ కేవలము కుర్చీ కొట్లాటలు మాత్రమే జరుగుతున్నాయి.
అభివృద్ధి అనేది పక్కదారి పడుతుంది. ప్రజల కనీస అవసరాలు అందని పండులాగా అయిపోయాయి. ఎన్నికల బరిలో నిలిచామా, ఎన్నికల ప్రచారం చేసామా, ఎన్నికల్లో ఎలా గెలవాలి, ముఖ్యమంత్రి సింహాసనాన్ని ఎలా అదిష్టించాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మెదడులో ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ప్రజల కోసం ఏం చేయాలి, ప్రజల మనుషులుగా ఎలా మేదలాలి, ప్రజల కష్టాలను ఎలా తీర్చాలి,అనే మాటలు ద్వితీయాంశంగా మారిపోయాయి.