Nadendla Manohar : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను బుధవారం నుంచి ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ యాత్రకు సంభందించి కార్యకలాపాలన్నీ సిద్ధమయ్యాయి. కార్యకర్తలు, నాయకులు యాత్రకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. నాదెండ్ల మనోహర్ యాత్రకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టే వారాహి యాత్రను జనహిత పేరుతో అంబులెన్సు వాహనం అనుసరించనుంది. అత్యవసర సమయాల్లో వైద్యం సదుపాయం అందించే విధంగా అంబులెన్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 8 గంటల లైఫ్ సపోర్ట్ తో వెంటిలేటర్, మోనిటర్ తోపాటు ఆక్సిజన్, ఎమర్జెన్సీ కిట్లూ జనహితలో ఉన్నాయి.
అత్యవసర మందులు, ప్రాథమిక వైద్యానికి తగిన పరికరాలు కూడా అంబులెన్స్ లో ఉంచారు. జనహితను డాక్టర్ లక్ష్మణరావు చిట్టెం పర్యవేక్షించనున్నారు. వారాహి వెనుకనే వచ్చే ఈ జనహిత: అంబులెన్స్ లో డ్యూటీ డాక్టర్, నర్సు, డ్రైవర్ ఉంటారు. జనహిత అంబులెన్సును సోమవారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు.
అంబులెన్స్ లోని అత్యాధునిక వైద్య పరికరాలను స్వయంగా పరిశీలించారు. అంబులెన్సు పర్యవేక్షకుడు డాక్టర్ లక్ష్మణరావు చిట్టెంతో మాట్లాడి ఇతర వివరాలు తెలుసుకుని, అభినందించారు. ఈ సందర్భంగా మనోహర్ గారు మాట్లాడుతూ “వారాహి యాత్రలో అంబులెన్సు అవసరమే రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం” అని ఆశాభావం వ్యక్తం చేసారు.