Nellore Politics : వైసీపీ కంచుకోట ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రసవత్తర రాజకీయం.. అధికార పార్టీకి ఎదురుగాలి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2014 ఎన్నికల్లోనే నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట అని తేలిపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ నెల్లూరు జిల్లాలో 10 స్థానాల్లో మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక 2019 లో అయితే వైసీపీ మొత్తం 10 స్థానాలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది.
అయితే 2024 ఎన్నికలు మాత్రం రసవత్తరంగా ఈ జిల్లాలో ఉండబోతున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. దీనితో 2019 ఎన్నికల్లో ఉన్నంత సానుకూలత అధికార పార్టీకి ఈ ఈసారి కష్టమే అని అంటున్నారు. ప్రజల్లో వ్యతిరేకత తో పాటు సొంత పార్టీ నాయకులే ఎదురుతిరిగారు. ఆనం రామనారాయణ రెడ్డి , కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి తొలగించబడ్డారు.
ఈసారి టిడిపికి జనసేన బలం కూడా తోడవుతుంది కాబట్టి అత్యధిక స్థానాలు కాకపోయినా కొన్ని స్థానాలు గెలుచుకున్న చాలు. వైసీపీ కంచు కోట బద్దలైనట్లే అని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా వెంకటగిరి, నెల్లూరు సిటీ, కావాలి, కోవూరు, గూడూరు లాంటి నియోజకవర్గాల్లో అధికార పార్టీ బాగా బలహీన పడ్డట్లు తెలుస్తోంది.
వెంకటగిరిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి వైసిపి తరుపున టికెట్ ఆశిస్తున్నారు. దాదాపుగా ఆయనకే టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. కానీ ప్రజలు మాత్రం రామ్ కుమార్ రెడ్డిని ఓన్ చేసుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ రూరల్ ప్రాంతాల్లో టిడిపి కురుగొండ్ల రామకృష్ణకి స్థానికుడు అనే సానుభూతి ఉంది.
రామ్ కుమార్ రెడ్డి ప్రచార ఆర్భాటమే తప్ప సామాన్యులతో మమేకం అయ్యే విధానం ప్రజలని ఆకట్టుకోవడం లేదు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ కి ఇక్కడ సరైన ప్రాధాన్యాత లభించలేదు అనే వ్యతిరేకత కూడా ప్రజల్లో ఉంది. ఈ అంశాలన్నీ ఉపయోగించుకుంటే టిడిపికి అనుకూలమైన స్థానం అవుతుంది వెంకటగిరి.
Pawan Kalyan : రాప్తాడులో జర్నలిస్ట్ దాడి ఘటనపై జనసేనాని ఫైర్.. జగన్ పాలనంతా హింసే
మరోవైపు నెల్లూరులో వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మైనస్ గా మారారు. నీటిపారుదల శాఖా మంత్రిగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పలికిన బీరాలు అన్ని తీవ్ర ట్రోలింగ్ కి గురయ్యాయి. ప్రత్యర్థుల్ని అనిల్ కుమార్ యాదవ్ అగౌరవంగా హద్దులు దాటి మాట్లాడడం కూడా మైనస్ అయింది. అయితే రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండడం వైసీపీకి కలసి వచ్చే అంశం. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, కావలి స్థానాలని జనసేన పార్టీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేనకి ఒక్క సీట్ దక్కినా జనసేన పార్టీ యువత నుంచి టీటీడీకి ఓట్ ట్రాన్స్ఫర్ బలంగా జరుగుతుంది. ఫలితంగా జనసేన టిడిపి చెప్పుకోదగ్గ స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది.