Pawan Kalyan : జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో 26 నియోజకవర్గాలకు బాధ్యుల నియామకం జరిగింది. జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని ఆయన వెల్లడించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారు… వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజనున్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు.
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 26 నియోజక వర్గాలకు ఇంచార్జులని నియమించారు. వారందరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ యూత్ వింగ్ తో ప్రారంభమై… ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది. జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారు. ఆ భావాన్ని పట్టుకొని ముందుకెళితే ఏదైనా సాధించగలం.
తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష అని ఆయన తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వరు. అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని” పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బి. మహేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాజలింగం పాల్గొన్నారు.