ట్రెండ్ ఫాలో కాను.. ట్రెండ్ సెట్ చేస్తా. ఇది గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ చెప్పిన డైలాగ్. యాజ్ టీజ్ గా ఈడైలాగ్ తనకు కరెక్ట్ అని నిరూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇప్పటి వరకు సంప్రదాయ రాజకీయ నేతలెవరికీ లేనివిధంగా సరికొత్త ఎన్నికల ప్రచార రథాన్ని స్వయంగా సిద్ధం చేయించారు పవన్ కళ్యాణ్. డిఫెన్స్ వాహనాన్ని పోలిన బస్సును రెడీ చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరో ఏడాదిన్న సమయం ఉన్నా.. ఇప్పటికే అన్ని పార్టీలు కదనరంగంలోకి దూకేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. త్వరలో బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఇందుకు సంబంధించిన వాహనం రెడీ అయింది. ఈ వాహనంలో జనసేనానిని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే ప్రభుత్వంపై పోరాడనున్నారు.
ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పవన్ పోస్ట్ చేస్తూ.. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. వాహనం చుట్టూ బాడీ గార్డులు నడుచుకుంటూ.. వాహనం రెండు వైపులా ఇద్దరు నిల్చున్న వీడియోను పవర్ఫుల్గా చిత్రీకరించారు. వారహి వాహనాన్ని పరిశీలిస్తున్న ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్, జనసేన నేతలు వైరల్ చేస్తున్నారు.
ఈ వాహనం ట్రయల్ రన్ను పవన్ కళ్యాణ్ బుధవారం హైదరాబాద్లో పరిశీలించారు. వాహనానికి సంబంధించి కొన్ని ముఖ్య సూచనలను పార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు ఇచ్చారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు. ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు. అందుకే తన ప్రచార వాహనానికి పవన్ కళ్యాణ్ వారాహి అని పేరు పెట్టారు.
అత్యాధునిక టెక్నాలజీతో..
ప్రత్యేక లైటింగ్… ఆధునిక సౌండ్ సిస్టమ్స్ వారాహి.. వాహనాన్ని ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్ పర్యటనలు చేసిన సందర్భాల్లో విద్యుద్దీపాలు ఆర్పిన విషయం తెలిసిందే. వాహనం నుంచి పవన్ లైటింగ్ కళ్యాణ్ ప్రసంగించే సందర్భంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. అలాగే ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు.
వారాహి.. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురైన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు.
కొండగట్టులోనే పూజలు ఎందుకంటే..
జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అక్కడే పూజలు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే.. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ప్రచారానికి వెళ్ళినప్పుడు పవన్ తలకు కరెంట్ తీగలు తగిలి ప్రాణాపాయం నుంచి తృటిలో బయట పడ్డాడు. అందుకే ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు తన ఎన్నికల ప్రచారంకోసం ప్రత్యేకంగా చేయించిన వారాహికి కొండగట్టు ఆలయం వద్దే పూజ చేసిన అనంతరం వాహనం పర్యటనకు బయల్దేరుతుంది.
Discussion about this post