Varahi VijayaYathra : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర ఎంతో విజయవంతంగా తూర్పుగోదావరి జిల్లాలో తన ప్రయాణాన్ని కొనసాగించింది. వైసీపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఈ యాత్రలో అడుగడుగునా ప్రజలు పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పలికారు. నలుదిక్కుల పోటెత్తినజనం నినాదాలతో తూర్పుగోదావరి జిల్లాలు దద్దరిల్లిపోయాయి. ఎక్కడ చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో వారాహి విజయయాత్ర విజయోత్సవంగా సాగింది.
ప్రతి చోట పవన్ కళ్యాణ్ జగన్ సర్కారు పనితీరును బయటపెడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడిచారు. పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర రాజకీయ నాయకుల్లో, అధికార పార్టీలో ఒక గుబులును తీసుకువచ్చింది. ప్రజా సమూహం మొత్తం పవన్ కళ్యాణ్ వెంటే అన్నట్టుగా, తమ ప్రియతమ నాయకుడి కోసం ప్రతి చోట అభిమానాన్ని చాటుతూ ఆయనకు స్వాగతం పలికారు.
ఈ నేపథ్యంలో నరసాపురంలో వారాహియాత్రను సాగిస్తున్న పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పెద్ద అంబిరంలోని నిర్మల దేవి ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ అస్వస్థకు కారణం ఆయన లోక శ్రేయస్సు కోసం చేపట్టిన ఉపవాస దీక్ష అని జనసేన నాయకులు తెలియజేశారు.
పవన్ ఉపవాస దీక్షలో ఉండడం వల్ల ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా సభలు, సమావేశాల్లో పాల్గొనడంతో అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా ఈరోజు ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గం నేతలతో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని మధ్యాహ్నం తర్వాత నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు వెల్లడించారు.ఈరోజు నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో చాలామంది కార్యకర్తలు జనసేన
పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించాల్సిన నేపథ్యంలో పవన్ అస్వస్థత వల్ల షెడ్యూల్ లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు జనసేన నాయకులు తెలిపారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలిసిన వెంటనే జనసైనికులు, జనసేన అభిమానులు ఆందోళన చెందడంతో పవన్ కళ్యాణ్ యాత్రను విరమించేదే లేదని యాత్ర ముందుకు సాగుతుందని ప్రకటించారు.