Varahi VijayaYathra : వారాహి విజయయాత్రలో దూసుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం లో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రాజకీయాల్లో గొడవలు సహజం. నేరపూరిత వ్యవస్థ ఉండకూడదు.పులివెందుల నుంచి వచ్చి పచ్చటి గోదావరి జిల్లాల్లో దౌర్జన్యం: చేస్తున్నారు. మేము రాజోలు నుంచి అక్కడకి వెళ్లి జగన్ రెడ్డికి సంస్కారం నేర్పిస్తాం. రాజోలు విజయం చీకట్లో చిరుదివ్వెలా మాకు ప్రేరణ ఇచ్చింది. రాజోలులో వెలిగించిన ఈ దీపం భవిష్యత్తులో రాజంపేట వరకూ వెలుగులు ప్రసరింప చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్.
క్రిమినల్ రాజకీయాలకు తాను వ్యతిరేకమన్నారు. పెద్ద మనుషుల ముసుగులో నేరాలు చేస్తూ పాలిస్తామంటే చికాకుగా ఉంటుందని చెప్పారు. రాజోలు విజయం తాలూకు వెలుగు ఏదో ఒక రోజు అఖండ జ్యోతిగా మారి రాష్ట్రం మొత్తం వెలుగులు ఇస్తుందని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు మార్పుకి సంకేతమని, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికారంలో ఉన్న వారు ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతారని చెప్పారు. దొంగ ఓట్లు వేస్తారు, ఉన్న ఓట్లు తీసేస్తారని, వీటన్నింటి మీద మనం పోరాటం చేయాలని సూచించారు.
ఒక పార్టీ నిర్మాణం చాలా కష్ట సాధ్యమైన అంశం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లు దోచేసి,అది కాస్త లక్ష కోట్లు దాటి పరిస్థితి. అలాంటి క్రిమినల్ రాజకీయాలు చేసే వ్యక్తులు, దౌర్జన్యాలు చేయగలిగి సమూహాలు ఉంటే విలువలు పాటించే వారు కూడా వారికి లొంగిపోతారు. ఇలాంటి వ్యవస్థల మధ్య రాజకీయ పార్టీ పెట్టడం చాలా సాహసోపేతమైన నిర్ణయం.
పార్టీ పెట్టడానికి కుల బలమో, ఒక ప్రాంతం బలమో సరిపోదు. మనది ప్రజాస్వామ్యం,కులస్వామ్యం కాదు. ఒకే కులం ఆధారంగా రాజకీయం చేయలేము. కులాలను గుర్తించి, గౌరవించి అసమానతలు తగ్గించాలి. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తే అది వైసీపీ రాజకీయం అవుతుంది. అలాంటి రాజకీయాల వల్లే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.