Varahi VijayaYathra : నరసాపురం నియోజకవర్గం నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. యుద్ధం మొదలుపెట్టినప్పుడు ముందుగా చిన్న చిన్న కోటలు కొట్టాలి.శివాజీ మహారాజ్ కూడా చిన్న చిన్న గెరిల్లా తరహా యుద్ధాలు చేసి, చిన్న ప్రాంతాలను మొదట స్వాధీనం చేసుకున్న తర్వాత రాజ్యం సాధించాడు. మనం కూడా అదే బాటలో ముందుకు వెళ్ళాం. ముందుగా ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త ప్రాంతాలుగా చేద్దాం.
ఇక్కడున్న 34 స్థానాల్లో ఒక్కటి కూడా వైసీపీ గెలవకూడదు. ఆ స్థాయిలో జనసైనికులు, జనసేన నాయకులు బలంగా పని చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాలను విముక్తం చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే అసాధ్యమేమీ కాదు. పుట్టీ పుట్టగానే అంతా నాయకులు అయిపోలేదు.. వైవీ సుబ్బారెడ్డిలాగా తెల్ల గెడ్డంతో పుట్టరు కదా? ఫ్రీ జగన్ రెడ్డి, కూడా ముఖ్యమంత్రిగా పుట్టలేదు కదా?
ముఖ్యమంత్రి కాకముందు ఆయన చేయాల్సిన దారుణాలన్నీ చేశారు. ఎస్సైని కూడా కొట్టారు. కడప జిల్లాలో ఆయన ఫ్రెండ్స్ వేటకు వెళ్తే పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు ఎస్సైని వేసి కొట్టిన వ్యక్తి ఆయన. ఇప్పుడు వైసీపీ నాయకులు, వారి పిల్లలు కూడా అదే ఫాలో అవుతూ ఎస్పీ, డిఎస్పీలను కొడుతున్నారు. మనం అవేమీ చేయలేదు? వారు చేస్తున్న దారుణాలపై అధ్యయనం చేస్తున్నాం. మనం మాత్రం బాధ్యతగా ముందుకు వెళ్తున్నాం.
చట్టాల మీద గౌరవం, భయం లేని వారు మనల్ని పాలించడం సరికాదు. ప్రజల్ని యదేచ్చగా దోచుకుంటూ మన హక్కుల్ని కాలరాస్తామంటే కుదరదు. దీన్ని ఎదుర్కోవాలంటే మనకు చట్టాల మీద కనీస అవగాహన అవసరం. బాపట్లలో 15 ఏళ్ల కుర్రాడిని తోటలోకి తీసుకువెళ్లి కాల్చేస్తే పోలీసులు స్పందించలేదు. రేపటి రోజున ఆ దాష్టీకాలు మన ఇళ్లలోకి వస్తాయి. మనం ఎదుటి వారికి ఆపద వచ్చినప్పుడు నోరెత్తకపోతే రేపటి
రోజున మనదాకా వచ్చినప్పుడు ఎవరూ ఉండరు. ఈ నెల 14వ తేదీ నుంచి యాత్ర ప్రారంభించి తూర్పు గోదావరి జిల్లాలో తిరిగాం. సమస్యలపై స్పందించాం. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అన్నది అర్ధం అవుతోంది. 2008 నుంచి రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్నాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.