YCP MP Balashauri Joins Janasena Party : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలలో మార్పులు చేర్పులు మొదలయ్యాయి. ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి నాయకులు తారుమారు అవుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోకి కూడా చేరికలపర్వం మొదలైంది. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈరోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేనలో చేరనున్నారు.
దీనికి కావలసిన ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశారు. జనసేన కార్యకర్తలు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బాలశౌరి తో పాటు తన అనుచరులు కూడా జనసేన పార్టీలో భారీ ఎత్తున చేరనున్నారు. కార్యకర్తలు ఇప్పటికే మంగళగిరి కి ర్యాలీగా కూడా తరిలారు.
ఈ క్రమంలోనే జనసేన మచిలీపట్నం నియోజకవర్గం ఇన్చార్జి బండి రామకృష్ణ ఆధ్వర్యంలో వందకు పైగా కార్లలో జనసేన సైనికులు రోడ్ ర్యాలీ తీయనున్నారు. 2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన బాలశౌరి ఆ పార్టీని వీడుతూ ఈరోజు జనసేనలో చేరడం రాజకీయంగా ఒక దుమారాన్ని రేపుతుందని చెప్పవచ్చు.