1990 మే నెల 4 వ తేదీన బంగాళాఖాతంలో మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడిన తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆ తుఫాను తీవ్రత ఐదు రోజులు కొనసాగి మే నెల 9వ తేదీన శాంతించింది అనుకునే లోపే మరొక విధ్వంసం మొదలైంది.
ఆ విధ్వంసం పేరు జగదేకవీరుడు అతిలోకసుందరి. మే నెల 9 వ తేదీ న ఈ తుఫాను తీరం దాటింది. ఎక్కడైనా తుఫాను తీరం దాటిన తర్వాత శాంతిస్తాయి. కానీ కోవెలమూడి రాఘవేంద్రరావు సృష్టించిన ఈ తుఫాను తీరం దాటిన తర్వాత ఉచ కోత కోసుకుంటూ రికార్డులను నేలమట్టం చేసేసింది.
థియేటర్లన్నీ నీళ్లు నిండి పోయి షో వెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఎగ్జిబిటర్లు ఉంటే, నడుం లోతు నీళ్ళు నిండిపోయినా పర్లేదు.. ఈ నీటిలో నిలబడే సినిమా చూస్తాము. చిరంజీవి సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ చూడాల్సిందే అని ప్రేక్షకులు పట్టుబట్టి తెరపై బొమ్మ పడేలా చేసిన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి. తుఫాను వచ్చే ముందు ప్రశాంతత లాగా సినిమా విడుదల సమయంలో చాలా ప్రశాంతత నెలకొని ఉంది. పాపం బాక్స్ ఆఫీస్ కి తెలియదు కదా.. తన బాక్స్ బద్దలై పోయే సినిమా విడుదలైందని.
ఇదేంటి సెకండ్ పార్ట్ లో చెప్పాల్సిన మేటర్ ని ఫస్ట్ పార్ట్ లోనే చెప్పేస్తున్నాను… తూచ్ ఇప్పటివరకు నేను చెప్పింది అంతా మర్చిపోండి ఫ్రెష్ గా మొదలుపెడదాం…
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కథ అసలు ఎక్కడ మొదలైంది?
కొన్ని అద్భుతమైన చిత్రాలకు తెర ముందు మనకు కనిపించే నటీనటులు మాత్రమే కాదు కాదు. ఎంతోమంది సాంకేతిక నిపుణుల కృషి ఆ చిత్రాల వెనుక దాగి ఉంటుంది. అలా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మొదలు కావడానికి మొట్ట మొదటి అడుగు ఎక్కడ పడింది? తెరవెనుక విషయాల గురించి ఈ ఆర్టికల్..
ఒకప్పుడు దక్షిణాదిలోని పేరెన్నికగన్న నిర్మాణ సంస్థ లైన విజయ, వాహిని, AVM స్టూడియో లాంటి సంస్థల సరసన వైజయంతి మూవీస్ ని నిలబెట్టిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున , శ్రీదేవి, సుహాసిని జంటగా నటించిన ఆఖరి పోరాటం చిత్రం 1988 మార్చి నెలలో విడుదల అయ్యి వైజయంతి మూవీస్ కి మంచి సక్సెస్ అందించింది.
ఆ తర్వాత అంతకంటే భారీ స్థాయిలో చిరంజీవి గారితో ఒక చిత్రాన్ని నిర్మించాలన్న అశ్వనీదత్ ఆలోచనలకు అనుగుణంగా కథల అన్వేషణ మొదలుపెట్టారు. మంచి కథతో వస్తే సినిమా చెయ్యడానికి నేను సిద్దమే అని చిరంజీవి సూత్రప్రాయంగా అంగీకరించారు. రోజులు గడుస్తున్నాయి కానీ.. అశ్వినీదత్ ఆలోచనలకు అనుగుణమైన కథ దొరకలేదు.
దర్శకుడు రాఘవేంద్రరావుకు దైవభక్తి ఎక్కువ. అశ్వినీదత్ తో కలిసి తిరుపతి స్వామివారి దర్శనం కొరకు వెళ్లి రావాలని అనుకొని మర్నాడు ఉదయం బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అనుకోకుండా దత్తుగారు ఆగిపోవాల్సిన పరిస్థితి. అప్పుడే ఆఖరి పోరాటం సినిమాకు కో డైరెక్టర్గా పనిచేసిన శ్రీనివాస చక్రవర్తి దత్తుగారి ఆఫీస్ కి వచ్చాడు. భలే టైం కి వచ్చావ్ రాఘవేంద్ర రావు గారితో కలిసి నేను తిరుపతి వెళ్ళాలి, కానీ ముఖ్యమైన పనిమీద ఆగపోవాల్సి వచ్చింది. ఆయనకు తోడుగా తిరుపతి వెళ్లిరా అని చెప్నారు.
‘సార్ నేను ఒక కథ అనుకున్నాను అది మీకు వినిపించడానికి వచ్చాను’ చెప్పాడు శ్రీనివాస్ చక్రవర్తి.
‘శ్రీనివాస్ నువ్వు చెప్పే కథ నా కంటే ముందు ఈ ప్రయాణంలో రాఘవేంద్ర రావు గారికి చెప్పు ఆయన ఒప్పుకుంటే మిగిలిన విషయాలు మాట్లాడదాం’ అని చెప్పి శ్రీనివాస్ చక్రవర్తిని తిరుపతికి పంపించారు దత్తుగారు.
ఆ ప్రయాణంలో తీరికగా దర్శనానంతరం కొండపైన విశ్రాంతి తీసుకుంటున్న రాఘవేంద్ర రావు గారితో ‘సార్ నా దగ్గర ఒక స్టొరీ లైన్ ఉంది. దేవకన్య ఆకాశం నుండి భూమికి వచ్చినప్పుడు జారవిడుచుకున్న ఉంగరం హీరోకి దొరుకుతుంది’ అనే స్టోరీ లైన్ చెప్పాడు. గతంలో తీసిన జగదేకవీరుడు కథకి పోలిన విధంగా ఉంది. దీని గురించి దత్తు గారి తో మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుండి తిరిగి వచ్చిన తరువాత స్టొరీ లైన్ గురించి దత్తుతో చెప్పారు. నాకైతే లైన్ నచ్చింది. కాకపోతే దీనిపై ఇంకా స్క్రిప్ట్ వర్క్ చేయాలి అని చెప్పి కథా చర్చలు ప్రారంభించారు.
ఈ చిత్రానికి మూలకథ శ్రీనివాస చక్రవర్తి అందిస్తే కథ చర్చలలో రచయిత యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి గారు, దత్తాబ్రదర్స్ (బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ సోదరులు) క్రేజీ మోహన్, అనంత్ గారు కలిసి కథకు తుది మెరుగులు దిద్దారు. కథా చర్చలతో పాటు మాటలలో జంధ్యాల గారు స్క్రీన్ ప్లే లో రాఘవేంద్ర రావు గారు పాలుపంచుకున్నారు. చిరంజీవి గారు నెల రోజులు కథా చర్చల్లో పాల్గొని తనకు తోచిన సూచనలు చేసారు.
మొదట కథా చర్చలలో హీరో పాప ట్రీట్మెంట్ కి డబ్బుల కోసం చంద్రుని పైకి వెళ్లేలా అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో అది అతిశయోక్తి గా అనిపిస్తుంది ఇంకేదైనా ఆలోచిద్దాం అనుకున్న సమయంలో మానస సరోవరం అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చిరంజీవి గారు చెప్పినదే. అంతేకాకుండా హీరో పాత్ర ఒక సాధారణ టూరిస్ట్ గైడ్. ఆ పాత్రకు తగిన విధంగా సాదా సీదాగా ఉండే దుస్తులు, పెరిగిన గడ్డం ఇలా హీరో లుక్ ఆయనే స్వయంగా డిజైన్ చేసారు.
ఇది చిరంజీవి-శ్రీదేవి మొట్టమొదటి సారి కలిసి నటించిన చిత్రం.
హిందీ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్న శ్రీదేవి కథ వినగానే ఎస్ ఈ చిత్రం నేను చేస్తాను అని ఓకే చేసి, దేవకన్యగా తను ధరించ బోయే కాస్ట్యూమ్స్ ప్రత్యేక శ్రద్ధతో స్వయంగా ముంబైలో డిజైన్ చేయించుకున్నారు.
ఇక టైటిల్ విషయంలో ఎన్నో అనుకున్నారు. రాజు-రాణి,
జగదేకవీరుడు-స్వర్గలోకసుందరి ఇలా చాలా టైటిల్స్ అనుకుంటున్న సమయంలో జంధ్యాల గారు జగదేకవీరుడు అతిలోకసుందరి టైటిల్ని సూచించారు అందరికీ నచ్చింది.
విలన్ గా ఎవరిని తీసుకోవాలో అని అనుకుంటున్న సమయంలో వారికి గుర్తొచ్చిన మొదటి వ్యక్తి అమ్రిష్ పురి. అంతకుముందే విడుదలైన హిందీ చిత్రం నాగినా లో శ్రీదేవి పాముగా అమ్రిష్ పురి మాంత్రికుడు చేసారు ఆ లుక్ కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి విలన్ పాత్రకి ఆయనని సంప్రదించి ఓకే చేసుకున్నారు.
సంగీతం మేస్ట్రో ఇళయరాజా, సాహిత్యం వేటూరి గారు, సినిమాటోగ్రఫీ విన్సెంట్ & ప్రకాష్ , ఆర్ట్ డైరెక్టర్ గా బి.చలం, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇప్పుడు దర్శకుడుగా మారిన y.v.s.చౌదరిలతో ఇలా ప్రతి రంగంలో లబ్ధప్రతిష్టులైన నిపుణులతో కూడిన బృందంతో షూటింగ్ మొదలైంది.
వైజయంతి మూవీస్ బ్యానర్లో చరిత్ర సృష్టించ బోయే చిత్రానికి అలా మొదటి అడుగు పడింది.
ఇప్పటివరకు షూటింగ్ కు ముందు ఏం జరిగిందో తెలుసుకున్నారు. షూటింగ్ ప్రారంభం అయ్యాక ఎలా జరిగిందో ఇంకో భాగంతో మీ ముందుకు వస్తాము.
Discussion about this post