ప్రజలు అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారా..? లేకపోతే భావొద్వేగాల ఓట్లు వేస్తారా..? అనే దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక స్పష్టత ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ “ఓదార్పు యాత్ర” కు అనుమతి ఇవ్వలేదనే సాకుతో సెంటిమెంట్ రాజేసి మొదలైన ఆయన ప్రస్థానం.. సొంత పార్టీ ఏర్పాటు, నిర్మాణం పూర్తి చేసి అనుభవజ్నుడైన చంద్రబాబు తో తలపడ్డారు.
నెమ్మదిగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తన ఖాతాలో వేసుకొని ఆ పార్టీ సీనియర్ నేతలను తన శిబిరం లో చేర్చుకుని తన కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రజల్లో సానుభూతి పొందారు. దాన్నే ఓటు బ్యాంకు గా మార్చి ప్రధాన ప్రతిపక్షం గా ఎదిగారు. తన తదుపరి లక్ష్యం ముఖ్యమంత్రి కావడంతో తెలుగుదేశం తన పార్టీని చీల్చే కుట్ర చేసిందని, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా తనను అణిచివేస్తుందని సుధీర్ఘ పాదయాత్రలో ప్రజల సానుభూతి పొందారు. ఆ సానుభూతితోనే విజయం సాధించారు.
ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాక తాను ఎన్నికల నినాదం గా మార్చిన “ప్రత్యేక హోదా” సాధ్యం కాదని పరోక్షంగా ప్రజలకు స్పష్టం చేసిన జగన్ తన రెండో వ్యూహం అమలులోకి తెచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా అమోదించిన అమరావతి రాజధాని అంశాన్ని మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అసెంబ్లీ వేదికగా అయోమయంలోకి నెట్టేసారు.
రాజధాని రైతులకు మరో అవకాశం లేకుండా, వారితో చర్చలు జరపకుండా విశాఖపట్నం రెండో రాజదాని అంటూ కొత్త రాగం అందుకుని ఉత్తరాంద్ర ప్రజల్లో సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా.
రోజు రోజు కు పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పధకాలు, నిధులు లేమి, నిరుద్యోగుల ఆందోళనలు, రోడ్ల తో సహా మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం చెందడం గమనించిన ముఖ్య మంత్రి తన సెంటిమెంట్ అస్త్రం మళ్ళీ బయటకు తీశారు.
ఇపుడు ఈ సెంటిమెంట్ రగల్చడం ద్వారా వివాదం పెంచి పెద్ద చేసి కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినా పార్టీ బలహీనంగా ఉన్న ఉత్తరాంధ్రని తన వైపు తిప్పుకోవడం తో పాటు తనకు పట్టున్న రాయలసీమ ఈ రెండు ప్రాంతాల నుండీ తన మ్యాజిక్ ఫిగర్ తనకు వస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ ప్రయోగం ఎంత వరకూ ఫలితం ఇస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా జగన్ మూడు రాజధానుల ఉచ్చులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు.. రాజకీయ పార్టీలు పడినట్టే కనిపించడం గమనార్హం.