1947 లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండీ 54 సంవత్సరాలు కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు దేశ ప్రజలు. చివరి సారి 2004 నుండీ 2014 వరకూ వరసగా రెండు సార్లు (UPA) అవకాశం ఇచ్చిన జనం.. 2014 లో మాత్రం కాంగ్రెస్ ని ఘోరం గా తిరస్కరించారు. దేశ చరిత్రలోనే ఎక్కువ కాలం పాలించిన రికార్డ్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 19% ఓట్లు.. 44 సీట్లు ఇచ్చారు దేశ ప్రజలు. తర్వాత 2019 లోనూ దాదాపు ఇదే పరిస్థితి. 52 సీట్లు మాత్రమే.
చివరికి కాంగ్రెస్ పార్టీ కంచుకోట అమేథీ లో రాహుల్ గాంధీ ఓటమి పాలవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కాంగ్రెస్ పని అయిపోయింది అన్నారు. రాహుల్ కి శక్తి సామర్ధ్యాలు లేవు అన్నారు. చూస్తుంటే పరిస్థితి అలానే అనిపించింది కూడా.. అసలు కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందా..? మళ్లీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయా..? కానీసం ఆ పార్టీ లో వాళ్ళకైనా ఆశలు ఉన్నాయా..?
అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆగస్ట్ మొదటి వారంలో దేశ వ్యాప్త పాద యాత్ర చేస్తున్నట్టు ప్రకటించిందో.. ఒక్కసారిగా ఆ పార్టీలో చలనం వచ్చింది. ఆశలు సన్నగిల్లిన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గేలి చేసిన అధికార బీజేపీ పార్టీ ఉలిక్కి పడేలా చేసింది ఆ ఒక్క ప్రకటన.
యాత్రకు “భారత్ జోడో యాత్ర” గా నామకరణం చేసిందికాంగ్రెస్ పార్టీ..ఈ యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలై కశ్మీర్ వరకూ 3,575 కిలోమీటర్లు సాగనుంది అని ప్రకటించారు. దేశం నేడు ఎదుర్కొంటున్న మూడు ప్రధాన విపత్కర అంశాలను కేంద్రంగా చేసుకుని ఈ యాత్ర కొనసాగుతున్నది అని రాహుల్ తెలిపారు.
ఒకటి : దేశంలో BJP – RSS లు అమలు చేస్తున్న మతతత్వ, కుల తత్వ, భాషాధిపత్య, ప్రాంతీయ తత్వ విద్వేష పూరిత, విభజిత రాజకీయ కార్యాచరణలను, భావజాలాన్ని తిప్పికొడుతూ దేశంలోని ప్రజా సమూహాలన్నిoటినీ ప్రేమ, సమత్వం, సహోదరత్వo పునాదిగా కలిసికట్టుగా ఐక్యంగా నిలిపేందుకు..
రెండు : దేశంలోని కొద్దిమంది పెట్టుబడి దారులకు కొమ్ము కాస్తూ, దేశ సంపదను కొద్ది మంది తన అనుకూలురకు దోచిపెడుతూ BJP అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఎన్నడూలేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. విద్యావంతులకు, యువతకు ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..ఈ నేపథ్యంలో యువతకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను రూపొందించే విధంగా బిజేపీ పాలనపై వత్తిడి తెచ్చేందుకు, ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడం.
మూడు : దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల కారణంగా రోజురోజుకూ పెరుగుతున్న అధిక ధరలు అన్ని వర్గాల ప్రజల జీవితాలని ఆర్థిక సంక్షభంలోకి నెడుతున్నాయి. బిజేపీ అనుసరిస్తున్న ఈ ప్రజావ్యతరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలను(పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల) తగ్గించి ప్రజలకు ఆర్థిక ఉపశమనం కలిగించాలనే ఈ మూడు ఉద్దేశ్యాలతో కాంగ్రెస్ పార్టీ ఈ యాత్ర కు సంకల్పించింది. ముఖ్యంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ యాత్ర కొనసాగుతుంది అని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకూ కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో నెలనుండీ సాగుతున్న ఈ యాత్రకు ప్రజల్లో విశేష ఆదరణ లభించింది. అడుగడుగునా రాహుల్ గాంధీకి జనం నీరాజనాలు పట్టారు. పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తిరిగి రప్పించి కాంగ్రస్ కు పూర్వ వైభవం తేవాలన్న బృహత్తర కార్యాన్ని భుజాలకెత్తుకున్న రాహుల్ గాంధీ ప్రజలతో చేయి చేయి కలిపి కథం తొక్కుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
రాహుల్ గాంధీ వెంట ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు యువకులు, రైతులు, కార్మికులు, చేతి వృత్తులవారు, వికలాంగులు, మహిళలు, దళితులు, మైనార్టీలు, బలహీన వర్గాల వారూ, ఇలా సమాజం లోని అన్ని సమూహాల ప్రజలూ లక్షలాదిగా, వేలాదిగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. రహదారుల వెంబడి స్వాగతం పలుకుతున్నారు.
భారత దేశ చరిత్రలోనే అత్యధిక దూరం , అత్యధిక రోజులు సాగుతున్న ఈ భారత్ జోడో యాత్ర చరిత్రాత్మకమైనదనిగా రికార్డు సృష్టిస్తుంది. తాజాగా ఇపుడు ఈ యాత్ర ఆంధ్ర ప్రదేశ్ లోకి అక్టోబర్ 14న అనంతపురం జిల్లాలో ప్రవేశించి అదే రోజు మళ్ళీ కర్నాటక రాష్ర్టంలోకి వెళుతున్నది.. మళ్లీ అక్టోబర్ 18 నుండి 21 వరకూ నాలుగు రోజుల పాటు కర్నూలు జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగనున్నది.
(రూట్ మ్యాప్ లో పేర్కొన్న విధంగా)
అయితే ఆంధ్రప్రదేశ్ కి వచ్చే సరికి రాష్ట్రాన్ని విడదీశారు అన్న వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకొని పోయింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ కు హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక తరగతి హోదా ను అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ APకి తీరని ద్రోహం చేసింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను అమలు చేయకుండా తీవ్ర అన్యాయం చేసింది.
ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంద్ర వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, ఇందిరా సాగర్ పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మానం, రైల్వే జోన్, మెట్రో రైలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, దుగరాజ పట్నం పోర్టు, కొన్ని జాతీయ విద్యా సంస్థలు ఇలా అనేక చట్టబద్దమైన అభివద్ధి అంశాలని బీజేపి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వంచించింది.
ఈ అంశాలపై ఇప్పటికే రాహుల్ గాంధీ అనేక సార్లు రాష్ట్ర ప్రజల పక్షాన గళమెత్తారు.
ముఖ్యంగా రాహుల్ గాంధీ అనేక సార్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపడితే తొలి సంతకం ఏపి కి ప్రత్యేక హోదా పైనే నని అనేక సార్లు హామీ కూడా ఇచ్చారు. ఇపుడు యాత్ర ద్వారా కూడా మరో సారి ఈ అంశాలు లెవనెత్తే అవకాశం ఉంది. మరి ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట అయిన ఆంధ్రప్రదేశ్ లో తిరిగి తమ హవా చూపించే విధంగా ఈ యాత్రలో రాహుల్ ఏమైనా పావులు కదుపుతారా..? తిరిగి AP లో బలాన్ని పొందగలుగుతారా..? అన్నది చూడాలి.
కానీ ఈ యాత్ర ద్వారా రాహుల్ జనానికి దగ్గరవుతున్నారు అన్నది మాత్రం వాస్తవం.. కాంగ్రెస్ పార్టీ తిరిగి బలపడుతుంది అన్నది కూడా నిజం. ప్రజాస్వామ్యం లో ఒక పార్టీ గెలవడమో లేదా మరో పార్టీని ఓడించడమో ఉండదు.. జనం గెలిపించడం జనం ఓడించడం మాత్రమే ఉంటుంది. అంతిమ తీర్పు ఎప్పుడూ ప్రజలదే..జనం లో ఉన్నవాడే.. జనం మనసు గెలిచిన వాడే రాజు..