Janasena : ఇక్కడ జనసేన విజయం లాంఛనమే..
జనసేన కు ఉన్న తన సొంత బలంతో పాటు సరైన అభ్యర్థిని నిలబడితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది గత ఎన్నికల్లో చూపిన నియోజకవర్గం నరసాపురం. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడ గెలవకపోయినా తన ప్రభావాన్ని మాత్రం చాలా బలం గా చూపించింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ జనసేన 49,120 ఓట్లు తెచ్చుకుని 35.97% ఓట్ షేర్ సాధించింది. రాష్ట్రంలో జనసేనకు ఇదే అత్యధిక ఓట్ షేర్. విజయం సాధించిన రాజోలు లో జనసేన వోట్ షేర్ 33.39%. అలాగే వైసీపీ టీడీపీలతో పాటు అన్ని బూత్స్ నుండి సమానం గా ఓట్లు సాధించిన నియోజవర్గాలు జనసేనకు ఉన్నవి కేవలం 4 నియోజకవర్గాలు మాత్రమే.. అందులో రెండు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం కాగా మూడోది విజయం సాధించిన రాజోలు. ఇవికాక ఉన్న ఏకైక నియోజకవర్గం నరసాపురం. సామాజిక సమీకరణాలు సరిగ్గా కుదిరితే జనసేనకు గత ఎన్నికల్లో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉండేది.
AP Politics : ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న పొలిటికల్ హీట్ ; వేగంగా మారుతున్న సమీకరణాలు..!
ఒకసారి గత ఎన్నికల రిజల్ట్ చూస్తే.. మొత్తం ఇక్కడ 1,36,658 ఓట్లు పోలవ్వగా.. విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు 55,556 ఓట్లు సాధించారు.. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు.. టీడీపీ అభ్యర్థి బండారు మాధవ నాయుడు కు 27,059 సాధించారు.
పొత్తులో భాగంగా ఈసారి ఇక్కడ జనసేనకే టికెట్ లభించే అవకాశం ఉంది. ఇవ్వాలి కూడా.. ఎందుకు అంటే ఇక్కడ టీడీపీ బలం నామమాత్రమే.. పార్టీ పెట్టినప్పటి నుండీ టీడీపీ కంచుకోట గా ఉన్న నరసాపురం నియోజకవర్గం ఉన్నప్పటికీ అది కేవలం అభ్యర్థుల బలమే తప్ప టీడీపీ పార్టీ సొంతబలం ఏమాత్రం కానే కాదు.. అక్కడ బలమైన కాపు సామాజిక వర్గపు ఓట్లే అభ్యర్థుల విజయాన్ని డిసైడ్ చేస్తాయి. 1983 నుండీ 2004 వరకూ టీడీపీ ఇక్కడ జయకేతనం ఎగురవేసింది అంటే అది కేవలం హరి రామ జోగయ్య మరియు కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి అభ్యర్థుల బలమే.. ఇదే విషయం 2009, 2014 రిజల్ట్ గమనిస్తే మనకు తేటతెల్లమవుతోంది.
2009 లో జరిగిన ముక్కోణపు పోటీలో ఇక్కడ టీడీపీ మూడోస్థానం ఉంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ప్రసాద రాజు కి 58,560 ఓట్లు పోలవ్వగా ప్రజారాజ్యం నుండి పోటీ చేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు 41235 సాధించారు. పార్టీ పెట్టిన తరువాత ఓటమే ఎరుగని టీడీపీ కి కేవలం 10,841 ఓట్లు రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ బలమైన కాపు సామాజికవర్గం ఓట్లు గంపగుత్త గా సుబ్బారాయుడు కు పడడమే.
ఇక 2014 విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు కు 72,747 ఓట్లు వచ్చి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీనికి కారణం ఆ ఎన్నికల్లో టీడీపీ కి మద్దతుగా జనసేన పార్టీ నిలబడడమే. 2019 ఎన్నికల్లో అదే బండారు మాధవ నాయుడు పోటీలో జనసేన ఉండటంతో ముక్కోణపు పోటీలో 27,059 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ జనసేన తరపున బరిలో నిలిచిన బొమ్మిడి నాయకర్ మత్య్సకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కాపులు జనసేన పార్టీ కే ప్రయారిటీ ఇవ్వడం ఇక్కడ చూడాల్సిన అంశం. దానికి తోడు నాయకర్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా కొంత తన వైపుకు తిప్పుకోవడం లో సఫలం అయ్యారు. అయితే పూర్తిగా ఆయన సామాజిక వర్గం ఓట్లు ఆయనకు పడకపోవడం తో రెండో స్థానం తో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఇక ప్రస్తుతానికి వస్తే.. 2019 ఓటమి తరువాత బొమ్మిడి నాయకర్ బలంగా నియోజక వర్గంలో తిరుగుతూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం లో పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఎప్పుడూ ప్రజాల్లోనే ఉండడం ఆయనకు సానుకూల అంశం. పైగా ఈ సారి ఆయన సామాజిక వర్గం ఓట్లు గంపగుత్త గా ఆయనకే పడే పరిస్థితి. జనసేన కు టికెట్ ఇస్తే అక్కడ బలమైన కాపు సామాజిక వర్గం ఓట్లు మరియూ నాయకర్ సొంత సామాజిక వర్గం (రెండూ కలిపి దాదాపు 80000 ఓట్లు) తో పాటు ఇతర బీసీ వర్గాల ఓట్లుదానితో పాటు వైసీపీ వ్యతిరేక ఓట్లు మొత్తము కలిపి జనసేన ఇక్కడ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. బొమ్మిడి నాయకర్ అయితే ఇక్కడ విజయం నల్లేరు మీద నడకే..
Discussion about this post