Pawan kalyan : దేశీయ పరిజ్ఞానంతో ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారతదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటి ఎన్వీఎస్-1 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ – 12 వాహన నౌక ద్వారా సోమవారం విజయవంతంగా ప్రయోగించి, కక్షలోకి ప్రవేశపెట్టడం భారతీయులుగా గర్వించదగిన విషయం అని పవన్ కళ్యాణ్ ఇస్రో కృషిని కొనియాడారు.
ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన భారతదేశపు అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రగతిని చూసి గర్వపడే క్షణాలివి అని ఆయన వాటిని మననం చేసుకుంటూ.. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అహ్మదాబాద్ లోని స్పీస్ అప్లికేషన్ సెంటర్ లో అధునాతన సాంకేతికతతో రూపొందించిన నావిక్ రెండోతరం ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష పరిశోధన కీర్తి పతాకలో మరో కలికితురాయి అని
పవన్ కళ్యాణ్ ఇష్రో విజయ పరంపరణను పొగిడారు. ఎల్ 1 సిగ్నల్స్ ను పంపి రెండో తరం నావిక్ ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థలో ఖచ్చితమైన సమాచారాన్ని పంపేందుకు ఉపయోగపడతాయి. ఇవి భవిష్యత్తు సమాచార విప్లవంలో కొత్త పుంతలు తొక్కిస్తాయనడంలో సందేహం లేదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ప్రయోగంలో పాలు పంచుకున్న ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఇస్రో పురోభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న వారందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున హార్దిక శుభాకాంక్షలు అంటూ.. ఇస్రోకు పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రశంసల జల్లు కురిపిస్తూనే మరోవైపు అభినందనలు తెలియజేశారు.