జగన్ మరీ ఇలాంటి సిట్యుయేషన్ లోకి వెళ్లిపోతాడాని వైసీపీ శ్రేణులే ఊహించలేదు అంటున్నాయి. అసలు జగన్ ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నాయి. 175 కి 175 సాధిస్తాం అని చెప్పి ఇపుడు సడెన్గా RGV ని తెరపైకి తేవడం.. పైగా స్వయంగా ఆయనే కలసి చర్చించడం వైసీపీ వాళ్ళకే మింగుడు పడని పరిస్థితి. అసలు జగన్ కి RGV తో సినిమా తీయించాలనే సలహా ఇచ్చిన వారెవరు..? ఎవరైనా సలహా ఇచ్చారా లేక ఆయనే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అంతుపట్టడం లేదు.
ఇపుడు RGV సినిమా చూసి జనం వైసీపీ కి 175 సీట్లు కట్టబెట్టేస్తారా..? అసలు అధికారం లోకి వచ్చాక జగన్ కి ఏం అయింది ? ఒంటి చేత్తో 150 సీట్లు తీసుకొచ్చిన జగన్ ఇతనేనా..? జగన్ లో ఆ కాన్ఫిడెంట్ ఏమైంది..? ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నాలు చేయక పోగా ఇలాంటి పిచ్చి పనులు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అధికారంలో లేనప్పుడు ఏవైనా ఓకే. ఇపుడు అధికారంలో ఉండి అభివృద్ధి మీద దృష్టి పెట్టక ఇలాంటి పనులు చేస్తే జనంలో పలుచన కావడం తప్ప జగన్ కి వచ్చే ప్రయోజనం ఏముంది.? అసలు నిజంగానే RGV సినిమా వెనుక జగన్ సూచనలు ఉన్నాయా లేక ఏ సిట్యుయేషన్ ని అయినా తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకునే RGV ఇపుడు జగన్ తో మీటింగ్ అడ్డుపెట్టుకుని జగన్ ని కలసి రాగానే ఇలా సినిమా అనౌన్స్ చేసి తన వెనుక వైసీపీ వుండన్నట్లు కలరింగ్ ఇస్తున్నాడా..?
ఏది ఏమైనా ఇప్పటికైనా జగన్ కళ్ళు తెరవాలి. సంక్షేమ పథకాలతోనే జనం సంతృప్తి చెందుతారు అనుకోవడం.., వాటిని మాత్రమే నమ్ముకుని ఎలక్షన్స్ కి వెళ్లడం అంటే రిస్క్ లో కాలేసినట్టే. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉంది. జగన్ ఇమేజ్ కి అది పెద్ద డ్యామేజ్ ఇదే. గడప గడపకూ ప్రోగ్రాంలో MLA లను రోడ్ల విషయం పై నిలదీస్తున్న పరిస్థితి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మూడు రాజధానులు అనడమే గానీ ప్రస్తుతం రాష్ట్రానికి ఒక రాజధాని కూడా లేదు. 3D రాజధాని.. తాత్కాలిక రాజధాని అని చంద్రబాబు ని విమర్శించిన వైసీపీ… అధికారంలోకి వచ్చి మళ్లీ ఎలక్షన్స్ కి వెళ్లేసరికి రాష్ట్ర రాజధాని లేకపోతే అపుడు ప్రతిపక్షాల విమర్శలతో ప్రజలు ఏకీభవించకుండా ఉంటారా..?
లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాం అని చెబుతున్నా అవి ఏ ఉద్యోగాలు అన్నది అందరికీ తెలిసిందే. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోలవరం సంవత్సరం లో పూర్తి చేస్తాం అని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరాలు దాటింది. అదీ కంప్లీట్ అవుతుంది అని ఆశ లేదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పులు తేవడం జనానికి పంచడం అని చివరకు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇక మద్య నిషేదం గురించి అయితే దాని మీద వచ్చినన్నివిమర్శలు మరేదాని పై రాలేదు అనడం అతిశయోక్తి కాదు.
ఇన్ని విమర్శలు.. ప్రతికూల పరిస్థితులు ఉండగా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయక ఇపుడు ఈ సినిమా తీయించి జగన్ ఏం సాధిస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఈ సినిమా వెనక నేను లేను అన్నా.. నిజంగా జగన్ లేకపౌయినా బయట ప్రచారం జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇపుడు కాదు అంటే జనం విశ్వసిస్తారా..? ఏమైనా కానీ గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో ఎలక్షన్స్ కి వెళ్లిన జగన్ వచ్చే ఎన్నికలకి ఈ RGV డైరెక్షన్ ని నమ్మడం ఏంటి అని వైసీపీ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి.