Hasanamba Temple : దేవాలయం అంటే నిత్యం భక్తులకి దేవుడు దర్శనమిచ్చే చోటు. కానీ ఒక దేవాలయం మాత్రం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ ఒక్కరోజు మాత్రమే ఆ అమ్మవారి దర్శనం భక్తులకు దక్కుతుంది. మరి ఆ దేవాలయం ఎక్కడ ఉంది. దాని గురించిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.. ఈ ఆలయం కర్ణాటకలోని హసన్ జిల్లాలో కలదు. 12వ శతాబ్దంలోనే ఈ హసనాంబ అమ్మవారి ఆలయం నిర్మించారని చరిత్ర చెబుతుంది.
జైన మతాన్ని బాగా విశ్వసించే హొయసల సామ్రాజ్యంలోని రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర పుటల్లో లిఖించబడి ఉంది. అయితే ఈ అమ్మవారి ఆలయాన్ని ఒక దీపావళి రోజునే తెరుస్తారు. ఆ ఒక్కరోజు అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటేత్తుతారు. తిరిగి మళ్లీ దీపావళి వరకు అమ్మవారి దగ్గర వెలిగించిన నంద దీపం వెలుగుతూనే ఉండడం ఇక్కడ విశేషం. నంద దీపంతో పాటు పూలు, నీళ్లు, అన్నం నైవేద్యంగా కూడా అమ్మవారికి ఆరోజు సమర్పించుకుంటారు.
నంద దీపంలో సంవత్సరం వరకు సరిపోయేంత నెయ్యి ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఇక్కడ దాగి ఉంది. అమ్మవారికి పెట్టే అన్నం నైవేద్యం మళ్లీ ఏడాది తర్వాత తలుపులు తెరిచాక కూడా పాడవకుండా అలాగే స్వచ్ఛంగా ఉంటుందంట. ఆలయం వెనుక భక్తులు విశ్వసించే ఒక కథ దాగి ఉంది. పురాతన కాలంలో మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, బ్రహ్మీ, ఇంద్రాణి, చాముండి, వారాహి అమ్మవారు ఒక రోజు హసన్ జిల్లాకు వచ్చినప్పుడు అక్కడి అందాలను చూసి వారు పరవశించిపోయి అక్కడే కొలువై ఉండాలని నిర్ణయం తీసుకున్నారని భక్తులు చెప్తున్నారు.
అప్పటినుండి అమ్మవారు అక్కడే కొలువై ఉన్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ అమ్మవార్లు మనకు ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు. వైష్ణవి, కౌమారీ, మహేశ్వరి అమ్మవార్లు ఆలయంలోని మూడు చీమల పుట్టలో కొలువై ఉండగా, బ్రహ్మీ అమ్మవారు హౌసలకోటలోని కెంచమ్మా అమ్మవారిగా కొలువుదీరారు. చాముండి, వారాహి, ఇంద్రాణి అమ్మవార్లు దేవగిరి హోండా లోని బావుల్లో వెలిశారని భక్తులు చెప్తున్నారు.
హసన్ జిల్లాకు హసనాంభా అమ్మవారి పేరు నుంచే ఆ పేరు పెట్టారు. అక్కడి అమ్మవారు ఎప్పుడు నవ్వుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. అందుకే ఆ ఊరికి హసనాంబ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది. అమ్మవారి ఆలయానికి ఇంకో విశేషం కూడా ఉంది. ఒకసారి అమ్మవారి నగలను దొంగలు దొంగిలించడానికి వచ్చినప్పుడు అమ్మవారు వారిని రాయిగా మార్చేసిందనని అక్కడ భక్తులు చెబుతారు. ఇప్పటికి కూడా ఆ రాళ్లు ఆలయంలో మనకు దర్శనమిస్తాయి.
అలాగే ఒక అత్త, కోడలిని బాగా హింసిస్తుంటే అమ్మవారు అత్తను రాయిగా మార్చేసారంట. ఆ రాయి కూడా మనకు అక్కడ దర్శనమిస్తుంది. ఆ రాయి దిన,దినం పెరుగుతూ వస్తుంది. ఆ రాయి ఎప్పుడైతే అమ్మవారి పాదాలను తాకుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని భక్తులు చెప్తున్నారు. అలాగే మనకు తెలిసినంతవరకు రావణాసురుడికి పది తలలు ఉంటాయి. కానీ ఇక్కడ ఆలయంలో రావణాసురుడికి 9 తలలే ఉంటాయి. దాని వెనుక గల రహస్యం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు.