Lord Venkateswara : కలియుగ దైవంగా పేరుగాంచిన ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికలను తీరుస్తూ, ఇప్పటికీ నిత్య పూజలు అందుకుంటూ.. శోభాయమానంగా వెలిగిపోతున్నాడు. అయితే కలియుగ దైవాన్ని దర్శించుకోవడానికి భక్తులు అనేక రకాలుగా వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ దేవాలయానికి లేనటువంటి ఒక పద్ధతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉంది. అదేమిటంటే.. ఆ ఏడుకొండలను అధిరోహించి ఆ స్వామిని దర్శించుకోవడమే..
మరీ ఇంకెందుకు ఆలస్యం.. ఆ మార్గలేంటో తెలుసుకుందాం…
అన్నమాచార్యుడు : తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఏడుకొండలు ఎక్కాల్సిందే అని మనకు తెలిసిన విషయమే. ఆ ఏడుకొండలను అధిరోహిస్తే ఆ స్వామి దర్శనం మనకు కలుగుతుంది. అయితే వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు అయినటువంటి అన్నమాచార్య నడకమార్గాన్ని కనిపెట్టిన మొదటి వ్యక్తి. ఆ వెంకటేశ్వరున్నీ దర్శించుకోవడానికి అన్నమాచార్యుడు మొదటగా అలిపిరి మార్గం గుండా ఆ స్వామిని వెతుకుతూ ఏడుకొండలు అధిరోహించాడు. చాలావరకు భక్తులకు ఈ మార్గమే తదుపరి కాలాంతరంలో ప్రధాన మార్గంగా మారిపోయింది.
కానీ ఆ స్వామిని దర్శించుకోవడానికి ఇంకా దారులు ఉన్నాయి. సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కాలినడకన దైవదర్శనమే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసించి, ఇరుకైన మార్గాలగుండనే తమ భక్తిని చాటుతూ ముందుకు వెళుతుంటారు.
మొదటి దారి : శ్రీవారి దర్శనానికి మొదటి మార్గంగా అలిపిరిని మనం చెప్పుకోవచ్చు. ఈ దారి గుండనే మనం స్వామిని సులభంగా చేరుకోవచ్చు.
రెండవ దారి : ఆ స్వామి దర్శనానికి రెండో మార్గంగా తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురాన్ని చెప్పుకోవచ్చు. అక్కడి నుండి శ్రీవారి మెట్టు 5 కిలోమీటర్లు, మరల ఆ మార్గం గుండా 3 కిలోమీటర్లు వెళితే స్వామి దర్శనం అవుతుంది. చంద్రగిరి కోట నిర్మాణ అనంతరం ఈ దారి వెలుగులోకి వచ్చింది.
మూడవ దారి : ఈ మూడో మార్గం విజయనగర రాజుల కాలంనాటి నుండే ఉంది. ఆ మార్గంగా వెళ్లే భక్తుల కోసం ఆనాటి రాజప్రస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసి, రాతిమెట్లను నిర్మించారు. అతి ముఖ్యమైన దారిగా దీనిని చెప్పుకోవచ్చు. పూర్వీకుల నుంచి ఒక ప్రాశస్త్యాన్ని ఈ దారి చాటుకుంది. ఆ మార్గమే ఈశాన్య దిక్కున ఉన్న మామండూరు.
నాలుగవ దారి : తిరుమలకు పశ్చిమం దిక్కున ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్ గుండా శ్యామలకోన ప్రాంతం నుంచి వెళితే ఆ స్వామి దర్శనం అవుతుంది.
ఐదవ దారి : కళ్యాణి డ్యామ్ గుండా 5 కిలోమీటర్లు ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ ఒక మలుపు కనిపిస్తుంది. అక్కడినుండి తూర్పు వైపు తిరిగి కొంత దూరం వెళ్లిన తర్వాత నారాయణగిరి కొండలు వస్తాయి, ఆ స్వామి దర్శనం అవుతుంది.
ఆరవ మార్గం : కడప సరిహద్దుల్లో చిత్తూరు ప్రారంభంలోనే మనకు కుక్కల దొడ్డి అనే ఒక గ్రామం కనిపిస్తుంది. ఆ స్థలం దగ్గర నుంచి తుంబురతీర్థం, పాపవినాశనం మీదుగా వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవచ్చు.
ఏడవ మార్గం : ఇక ఏడవ మార్గంగా ఆవ్వాచారికోన మార్గాన్ని చెబుతుంటారు. రేణిగుంటకు దగ్గర్లో ఆంజనేయపురం అనే గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తే స్వామిని దర్శించుకోవచ్చు.
ఎనిమిదో మార్గం : ఎనిమిదో మార్గంగా ఏనుగుల దారిని చెప్తుంటారు. ఇది కూడా చాలా ప్రశస్తం పొందిన మార్గమే. ఎందుకంటే.. అప్పుడు ఆలయ నిర్మాణానికి ఈ మార్గం గుండానే ఏనుగుల ద్వారా మండపాలకు కావలసిన రాతి స్తంభాలను తీసుకువచ్చారు. ఈ మార్గం కూడా స్వామి దర్శనానికి అనుగుణమే.
తలకోన : తలకోన జలపాతం గుండా జండాపేట్ దగ్గర నుంచి వెళితే ఇంచుమించు ఆలయం దగ్గరలోకి సమీపించినట్టే, ఇది కూడా మంచి మార్గం అని చెప్పవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ కలియుగ దైవాన్ని మీరు దర్శించి, దైవ ఆశీస్సులను పొందండి.