గత కొన్ని రోజులుగా ఒక వర్గానికి చెందిన మీడియా తనపై కక్ష కట్టిందని, అది తెలంగాణ రాష్ట్ర సమితి కి దాసోహం గా మారిందని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మూడు ఛానల్స్ తనపై విషప్రచారం చేస్తున్నాయని ఆధారాలు లేకుండా అసత్యమైన కథనాలను ప్రచారం చేస్తున్నాయి అని ఆయన ఒక మీడియా సమావేశంలో బహిరంగంగా నిరసన తెలియజేశారు.
ఎమ్మార్వో అవినీతి వ్యవహారంలో తనకు సంబంధం లేకపోయినా తన అనుచరుల పేర్లు, తన పేరును ప్రస్తావించి కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆధారాలు లేనటువంటి ప్రతి కథనానికి తన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందనీ, కానీ వారు కూడా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారనీ.. యాజమాన్యాలు ఒక పార్టీకి వంత పాడడం వల్ల ఆయా మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయనీ, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి కామెంట్స్ పై అక్కడే ఉన్న కొంతమంది విలేకరులు తమ నిరసన తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా మీడియా పోరు టిఆర్ఎస్ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలి పోయిందనీ.. మెజారిటీ మీడియా అధికార పార్టీకి వంత పాడుతుందని రేవంత్ రెడ్డి మరోసారి వ్యాఖ్యానించి తన సమావేశాన్ని ముగించారు.