రాష్ట్రంలో మీడియా పోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఒక వర్గం మీడియా కక్షపూరితంగానే వ్యవహరిస్తోందని పార్టీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడం నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నిన్న ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేసిన వీకెండ్ కామెంట్ లో abn అధినేత రాధాకృష్ణ అసత్య ఆరోపణలు చేసారని, ఏ ఖచ్చితమైన సమాచారం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టు అవుతారని,ఆయన సతీమణి ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం పాత్రికేయ విలువలుకు విరుద్ధంగా ఉందని దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వంపై నిరంతరం అసత్యాలు ప్రచారం చేయడం ఆంధ్రజ్యోతి కి తగదని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు.
న్యాయమూర్తుల ఫోన్లు టాప్ చేస్తున్నారని ప్రచారం చేసిన తప్పుడు కథనంపై ఇప్పటికే ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఇటువంటి చర్యల వల్లే ఒకప్పుడు కేసీఆర్ తెలంగాణ లో అనధికారికంగా ఆంధ్రజ్యోతి ని నిషేదించారని ఇప్పుడు అదే పరిస్థితి ఆంద్రప్రదేశ్ లో కూడా ఉత్పన్నం కాకుండా ఆంధ్రజ్యోతి యాజమాన్యం చూసుకోవాలని కొందరు కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియాలో వర్గ పోరు ఇక ముందు ఎంత దూరం వెళుతుందో అని పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారు.