Prajagalam : ప్రజాగళం సభపై కుట్ర జరిగిందా..పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఎన్డీయే కూటమి నేతల ఫిర్యాదు
ఏపీలో ఎన్డీయే పొత్తు ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ భగీరథ ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఒకరకంగా టిడిపి ఎన్డీయేలో చేరడం వెనుక పెద్దన్న పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఎన్డీయే పొత్తు ఉండకూడదని అధికార వైసిపి పార్టీ ముందు నుంచి విశ్వప్రయత్నాలు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ వ్యూహం ముందు వైసిపి ఎత్తులు చిత్తయ్యాయి.
ఇక కూటమి ఏర్పడ్డాక కూడా వైసిపి కుట్రలు ఆగడం లేదు. ఆదివారం రోజు చిలకలూరి పేటలో జరిగిన ప్రజాగళం సభకి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారని సమాచారం. దీనితో కూటమి జైత్ర యాత్ర మొదలైనట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రధాని మోడీ పాల్గొన్న సభకి భద్రత లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. అధికార పార్టీ ఆదేశాలతోనే పోలీసులు నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరించారు.
ప్రజాగళం సభకి సరైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం పోలీస్ శాఖ పూర్తిగా విఫలం చెందింది అనేది వాస్తవం. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి.. ప్రధాని సభకి ఎందుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేకపోయారు.. ఆయన నిర్లక్ష్యపు వైఖరి ఎవరి కోసం అంటూ జనసేన, టిడిపి, బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు.
చాలా మందికి బ్లాంక్ పాసులు ఇవ్వడంలోనే భద్రత లోపం స్పష్టంగా కనిపించింది అని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సభా ప్రాంగణం మొత్తం పోలిసుల చేతిలోనే ఉంది. కానీ పదే పదే సభకి అంతరాయం కలిగింది. అయినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై విచారణ జరగాలి. భాద్యులపై చర్యలు తీసుకోవాలి అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
మరోవైపు ఎన్డీయే కూటమి నేతలు ప్రధాన ఎన్నికల అధికారిని కలసి ఫిర్యాదు చేసారు. జనసేన నుంచి బండ్రెడ్డి రామకృష్ణ, టిడిపి నుంచి వర్ల రామయ్య, బిజెపి నుంచి పాతూరు నాగభూషణం ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనాని కలసి మోడీ సభలో తలెత్తిన భద్రత లోపాలను వివరించారు. దీనికి కారణం పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి అని.. ఆయన వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాగళం సభ విజయవంతం కాకూడదని కొందరు కోరుకున్నరారని కూటమి నేతలు ఆరోపించారు.